
బీసీసీఐ కొత్త ప్యానెల్ ఏర్పడిన తర్వాత టీమిండియా సెలెక్షన్పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై భారత జట్టుకు ఎంపికవ్వాలంటే యో-యో టెస్టు క్లియర్ చేయక తప్పదని తేల్చిచెప్పారు. దీంతోపాటు డెక్సా టెస్టు కూడా చేస్తామని, ఈ పరీక్షల ఫలితాల ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పారు. అయితే ఈ నిర్ణయంపై మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు. ఆటగాళ్లకు కావలసింది యో-యో టెస్టు కాదన్న అతను.. ఆటగాళ్లు మ్యాచ్ ఫిట్నెస్ సాధించారా? లేదా? అనేది మాత్రమే చూడాలన్నాడు.
'ఫాస్ట్ బౌలర్లకు అవసరమైన ఫిట్నెస్ వేరే ఉంటుంది. వికెట్ కీపర్లకు మరింత ఫిట్నెస్ అవసరం. బ్యాటర్లు అంత ఫిట్నెస్ లెవెల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్లందర్నీ ఒకే గాడిన కట్టేస్తే ఎలా?' అని సునీల్ గవాస్కర్ ప్రశ్నించాడు. ఇలా ఒక్కొక్కొరి స్పెషాల్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే స్థాయి నిర్దేశిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గవాస్కర్ చెప్పాడు. ఆటగాళ్ల క్రికెట్ ఫిట్నెస్ అన్నింటికన్నా ముఖ్యమని చెప్పిన ఈ మాజీ లెజెండ్.. దీనికి సంబంధించిన టెస్టు ఫలితాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, అప్పుడు ఆటగాళ్లో యో-యోనా లేక నో-నోనా అనేది అందరికీ తెలుస్తుందన్నాడు.

అలాగే సెలెక్షన్ కమిటీ ఎంపికపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొత్త సెలక్షన్ కమిటీకి కూడా ఛీప్గా చేతన్ శర్మనే నియమించారు. ఈ కమిటీలో ఎస్ఎస్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ ఉన్నారు. వీళ్లే కాకుండా ఎవరైనా మెడికల్ నిపుణులను కూడా కమిటీలో చేరిస్తే బాగుండేదని గవాస్కర్ చెప్పాడు. ఎందుకంటే ఒక స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటే.. ఇద్దరిలో ఎవరు ఫిట్గా ఉన్నారనే విషయాన్ని మెడికల్ నిపుణులు చెప్పగలుగుతారని, అలాంటి వాళ్లు కూడా సెలెక్షన్ ప్యానెల్లో ఉంటే బెటర్ అని అభిప్రాయపడ్డాడు.