
ఐపీఎల్లో ఐదుసార్లు ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్ ఈసారి వేలంలో సరైన స్ట్రాటజీ ఫాలో అవలేదని, ఒక విభాగంలో ఆ జట్టు చాలా బలహీనంగా కనిపిస్తోందని మాజీలు అంటున్నారు. మినీ వేలంలో ముంబై జట్టు మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వెటరన్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా ఆటకు వీడ్కోలు పలకడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ జట్టు చాలా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆసీస్ యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ముంబై బౌలింగ్ చాలా బలహీనంగా కనిపిస్తోందని మాజీ లెజెండ్ వసీం జాఫర్ అంటున్నాడు. ఆ జట్టు వద్ద ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. గాయంతో ఆర్చర్ గతేడాది ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా అతన్ని ఈ ఏడాది కూడా తమ జట్టులో కొనసాగించాలని ముంబై నిర్ణయించింది. అయితే వీళ్లిద్దరూ గాయాల వల్ల చాలా కాలం ఆటకు దూరమయ్యారు. మళ్లీ తిరిగి ఇప్పుడిప్పుడే మైదానంలో అడుగు పెడుతున్నారు. వాళ్లు సరైన ఫామ్లో ఉంటారనేది అనుమానమే.
ఇదే విషయాన్ని చెప్పిన వసీం జాఫర్.. ఇప్పుడు ముంబై ముందు ఉండే అతి పెద్ద ప్రశ్న ఫాస్ట్ బౌలర్ల ఫిట్ నెస్ గురించే అన్నాడు. 'చాలా గ్యాప్ తర్వాత ఆర్చర్, బుమ్రా తిరిగి మైదానంలోకి వస్తున్నారు. వాళ్లు కనుక అన్ని మ్యాచులూ ఆడకపోతే వాళ్ల ఫిట్నెస్ సరిగా లేదని అర్థం. దీంతో వాళ్ల బౌలింగ్ కూడా బలహీనం అయిపోతుంది. ఎందుకంటే ముంబై స్పిన్ విభాగం పెద్ద బలంగా లేదు. దీంతో మళ్లీ రోహిత్ తన బుర్ర గోక్కోవాల్సిందే. వాళ్ల బౌలింగ్ బలహీనంగా ఉందని నా అభిప్రాయం. బ్యాటింగ్ పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధార పడుతుందని చెప్పొచ్చు' అని జాఫర్ వివరించాడు.