
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనలో జెమీమా రోడ్రిగెజ్, హర్మన్ప్రీత్ కౌర్ అద్భుతంగా పోరాడారు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన హర్మన్ వింత పద్ధతిలో అవుటైంది. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా ఆమె బ్యాటు నేలలో దిగబడి ముందుకు జారలేదు. దీంతో ఆమె రనౌట్ అయింది.
ఈ మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ కన్నీళ్లు పెట్టుకుంది. తన బాధను దిగమింగుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా.. హర్మన్ను ఓదార్చింది. ఆమెను కౌగిలించుకొని ఓదారుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలా తను ఎందుకు చేసిందో అంజుమ్ చోప్రా వివరించింది. 'కెప్టెన్కు నా తరఫున సానుభూతి చూపించడం కోసమే అలా చేశా. బయటి నుంచి నేను అంతకుమించి ఏం చెయ్యలేను కదా. అది మా ఇద్దరికీ ఎమోషనల్ మూమెంట్' అని చెప్పింది.
భారత జట్టు చాలా సార్లు సెమీఫైనల్ చేరిందని, ఇదేం మొదటి సారి కాదని అంజుమ్ తెలిపింది. హర్మన్ చాలా సార్లు గాయాలు, అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ఆడటం చూశానని గుర్తుచేసుకుంది. 'సెమీఫైనల్లో అసలు హర్మన్ ఆడలేని పరిస్థితి. కానీ ఇది వరల్డ్ కప్ సెమీస్. అలాగే ఆమె కూడా సవాళ్లను నేరుగా ఎదుర్కొనే క్రీడాకారిణి. అందుకే బరిలో దిగింది' అని చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్కు ముందు హర్మన్ ప్రీత్ కౌర్, పూజ వస్త్రాకర్ ఇద్దరికీ అనారోగ్యం చేసింది. ఇద్దరూ స్థానిక ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ సమయానికి హర్మన్ తిరిగి వచ్చి భారత్ను గెలిపించడానికి శాయశక్తులా పనిచేసింది. కానీ ఫలితం మాత్రం ఆమెకు గుండెకోతనే మిగిల్చింది.