
బెంగళూరు: కర్ణాటక మాజీ క్రికెటర్, వెటరన్ క్యూరేటర్ గోపాలస్వామి కస్తూరిరంగన్ బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. బెంగళూరులోని చామరాజపేట స్వగృహంలో ఆయన తుదిశ్వాశ విడిచారు. కస్తూరిరంగన్ వయసు 89. బెంగళూరులోని స్వగృహంలో ఆయన కన్నుమూశారని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి మరియు ప్రతినిధి వినయ్ మృత్యుంజయ తెలిపారు. ఆటగాడిగానే కాకుండా క్రికెట్ పాలకుడు, బీసీసీఐ క్యూరేటర్గా కస్తూరిరంగన్ సేవలందించారు.
1948-1963 వరకు రంజీ క్రికెట్లో గోపాలస్వామి కస్తూరిరంగన్ మైసూర్కు ఆడారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కుడిచేతి మీడియం పేస్తో 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 94 వికెట్లు పడగొట్టాట్టారు. తన మీడియం పేస్తో కస్తూరిరంగన్ బ్యాట్స్మెన్ను వణికించేవారని పలువురు మాజీ క్రికెటర్లు గుర్తుచేసుకున్నారు. కస్తూరిరంగన్ మరణించడంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. పలువురు క్రికెట్ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
గోపాలస్వామి కస్తూరిరంగన్ మరణించారని తెలిసిన వెంటనే భారత మాజీ కోచ్, మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించారు. 'కస్తూరిరంగన్ మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను. క్రికెట్ అభివృద్ధి కోసం ఆయనెంతో కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ జంబో చేశారు.
'మాజీ రంజీ ఆటగాడు, కర్ణాటక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, బీసీసీఐ క్యూరేటర్ శ్రీ గోపాలస్వామి కస్తూరిరంగన్ ఆకస్మిక మరణం బాధాకరం. కర్ణాటక సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యులు, మేనేజింగ్ కమిటీ.. కస్తూరిరంగన్ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తోంది' అని కేఎస్సీఏ తెలిపింది. మొదట్లో మైసూర్కు ఆడిన కస్తూరిరంగన్ 1962-63లో కర్ణాటకకు ఆడారు.