
చెన్నై: టీమిండియా నుంచి మరో క్రికెటర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే బీజేపీలో చేరి ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీలో చేరడం విశేషం. 20 ఏళ్లు క్రికెటర్, కోచ్గా.. మరో 20 ఏళ్లు కామెంటేటర్గా పనిచేసిన తాను ఇకపై ప్రజాజీవితానికి అంకితమవుతానని చెప్పుకొచ్చారు.
55 ఏళ్ల లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన క్రికెట్ కెరీర్లో సాధించిన అతిపెద్ద విజయాల్లో 1985 ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ ఒకటి. ఆ జట్టులో శివరామకృష్ణన్ సభ్యులు. ఆ టోర్నీలో పది వికెట్లు తీసిన ఆయన అత్యుత్తమ బౌలర్గా నిలిచారు. 1983 నుంచి 1986 వరకు టీమిండియాకు శివరామకృష్ణన్ ప్రాతినిధ్యం వహించారు. కెరీర్లో 9 టెస్ట్ మ్యాచ్లు, 16 వన్డే మ్యాచ్లు ఆడారు. టెస్టుల్లో 26, వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టారు.
లక్ష్మణ్ శివరామకృష్ణన్ 76 ఫస్ట్క్లాస్ మ్యాచుల్లో 154, 33 లిస్ట్-ఏ మ్యాచుల్లో 37 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. శివరామకృష్ణన్ రిటైర్మెంట్ అనంతరం 2000 సంవత్సరం నుంచి వ్యాఖ్యాత కొనసాగారు. ఆట కంటే కూడా వ్యాఖ్యానంతోనే ఎక్కువ ప్రజాదరణ పొందారు. శివరామకృష్ణన్ అద్భుతంగా కామెంటరీ చేయగలరు. ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ ఇప్పటివరకూ అభిమానులను అలరిస్తున్నారు.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు జట్టు యాజమాన్యం, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయానని లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నారు. ఆటగాడు, కోచ్, కామెంటేటర్గా 40 ఏళ్లు క్రికెట్కు అంకితమైన తాను ఇప్పుడు మరో సవాల్కు సిద్ధమవుతున్నానని తెలిపారు. 'నా నగరం చెన్నై, నా రాష్ట్రం తమిళనాడు నాకు తొలి ప్రాథామ్యాలు. ఈ రెండింటి అభివృద్ధి కోసం పనిచేస్తా. క్రికెటర్గా నా ప్రతిభకు నేను న్యాయం చేయలేదని తెలుసు. రాజకీయాల్లోనైనా అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాను. ప్రజలు, పార్టీ, రాష్ట్రం, దేశానికి సేవ చేస్తాను. నా రెండో ఇన్నింగ్స్లో నిరాశపరచను' అని శివరామకృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు.