కోల్కతా: టీమిండియా మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా భార్యకు కరోనా వైరస్ సోకిందని శనివారం వైద్య అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న స్మితా సన్యాల్ శుక్లాకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే స్మితా సన్యాల్ శుక్లా ప్రస్తుతం బాగానే ఉన్నారు అని వైద్య అధికారులు తెలిపారు.
లక్ష్మీ రతన్ శుక్లా భార్య స్మితా సన్యాల్కు స్వల్ప జ్వరం ఉండటంతో.. ప్రోటోకాల్ ప్రకారం హోం ఐసోలేషన్లో ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు శుక్లా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బెంగాల్ రంజీ టీమ్కు రతన్ శుక్లా కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. 39 ఏళ్ల శుక్లా భారత్ తరఫున కేవలం మూడు వన్డేలను మాత్రమే ఆడాడు. మూడు వన్డేలలో కలిపి 18 పరుగులు చేశాడు. అందులో అత్యధిక స్కోర్ 13 కావడం విశేషం.
'నిజమే.. ఈ రోజు నా భార్య స్మితకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెకు స్వల్ప జ్వరం మాత్రమే ఉంది. వైద్యులు ఇచ్చిన మందులను వేసుకుంటున్నారు. ఆమె ఇంట్లోనే ఒంటరిగా ఉన్నారు. మా నాన్న, నేను, మా ఇద్దరు కుమారులు ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నాం. వచ్చే గురువారం అందరం కరోనా పరీక్షలు చేయించుకుంటాం' అని రతన్ శుక్లా తెలిపాడు.
ఇంతకుముందు స్నేహశిష్ గంగూలీ వైరస్ బారిన పడినట్లు ఆన్లైన్లో వార్తలు వచ్చాయి. అయితే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ శనివారం తన కార్యదర్శి వైరస్ బారిన పడినట్లు వచ్చిన నివేదికలను ఖండించాయి. మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ స్నేహశిష్ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. 'నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతిరోజూ ఆఫీస్ పనులు చూసుకుంటున్నా. నా అనారోగ్యం గురించి వచ్చిన వార్తలు నిరాధారమైనవి' అని స్నేహశిష్ కూడా చెప్పాడు.
కరోనా తెచ్చిన కష్టం.. బీఎండబ్ల్యూ కారును అమ్మకానికి పెట్టిన అథ్లెట్!!