
బెంగళూరు: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. క్రికెట్ అకాడమీ మంగళవారం బెంగళూరులో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలతో నవంబర్ 7 నుంచి అకాడమీ కార్యకలాపాలు మొదలవుతాయని నిర్వాహకులు గేమ్ప్లే, ఆర్కా స్పోర్ట్స్ సంస్థలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరులోని బిదరహల్లిలో ఏర్పాటు చేసిన ఎంఎస్ ధోనీ అకాడమీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి కోచింగ్ సౌకర్యాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన కోచ్ల సమక్షంలో యువ క్రికెటర్లకు ఈ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు.
ఎంఎస్ అకాడమీ ప్రారంభం సందర్భంగా గేమ్ ప్లే ఓనర్ ఎస్ దీపక్ భట్నాగర్ మాట్లాడుతూ... 'ఈ అకాడమీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా సంస్థకే గాక బెంగళూరు ప్రజలకు కూడా శుభవార్తే. క్రికెట్లో ఎదగాలని కోరుకునే పిల్లలు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇది మంచి అవకాశం. ఎంఎస్ ధోనీ అకాడమీలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు మరియు ప్రపంచ స్థాయి కోచింగ్ బృందం ఉంటుంది. వీలున్నప్పుడల్లా ఎంఎస్ ధోనీ కూడా అకాడమీకి వచ్చి విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు అందజేస్తాడు' తెలిపారు.
ఆర్కా స్పోర్ట్స్ మేనేజర్, ఎంఎస్ ధోనీ సన్నిహితుడు మిహిర్ దివాకర్ మాట్లాడుతూ... 'అకాడమీని ఆరంభించడం సంతోషంగా ఉంది. ఐపీఎల్ 2021 కారణంగా మహీ అందుబాటులో లేడు. లేదంటే అతడు కూడా వచ్చేవాడు. పేద పిల్లలకు ఇదో మంచి అవకాశం. ప్రతిభ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. గ్రౌండ్ బ్రేకింగ్ కోచింగ్ ప్రోగ్రామ్ సమగ్రత, టీమ్వర్క్, ఎంజాయ్మెంట్, ప్రొఫెషనలిజం మరియు అడాప్టబిలిటీలే మా ప్రధాన ఆయుధాలు' అని చెప్పారు. బెంగళూరు శివార్లలో 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్రికెట్ అకాడమీలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. 2019లో గేమ్ ప్లే సంస్థను స్థాపించిన నిర్వాహకులు.. క్రికెట్ మీద మక్కువ ఉన్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు.
ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్న ఎంఎస్ ధోనీ.. అకాడమీ ఆరంభం సందర్భంగా యువ క్రికెటర్లకు ఓ సందేశం పంపాడు. 'అకాడమీని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. యువ క్రికెటర్లకు 360 డిగ్రీలలో శిక్షణ ఇప్పించడమే గాక మంచి టెక్నిక్స్, టెక్నాలజీతో స్కిల్స్ కు మెరుగులుదిద్దడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రపంచస్థాయి కోచింగ్ బృందం మీకు అన్నివిధాలుగా అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది. వెంటనే రిజిస్టర్ చేసుకుని మా అకాడమీలో భాగస్వాములవ్వండి' అని మహీ అన్నాడు. అలానే యువ క్రికెటర్లందరికీ ఓ సలహ ఇచ్చాడు. ఫలితం కంటే దాని కోసం చేసే ప్రయత్నం చాలా గొప్పదన్నాడు. చిన్న చిన్న విషయాల మీద అవగాహన పెంచుకోవాలన్నాడు. మనం ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా సక్సెస్ అవుతామని మహీ పేర్కొన్నాడు.