క్రికెట్ అరంగేట్రం
కృష్ణమాచారి శ్రీకాంత్ దేశవాళీ క్రికెట్లో తమిళనాడు, సౌత్జోన్ తరఫున ఆడాడు. 1981లో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. అప్పుడు కృష్ణమాచారి శ్రీకాంత్ వయసు 21 సంవత్సరాలు. 1981లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్పై వన్డే అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో ముంబై వేదికగా ఇంగ్లండ్పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్తో కలిసి ఓపెనర్గా ఆడాడు. తన దూకుడైన బ్యాటింగ్తో మంచి ఓపెనర్గా స్థిరపడ్డాడు. ఆ తర్వాత క్రమంగా భారత జట్టులో శ్రీకాంత్ కీలక ఆటగాడిగా మారాడు.

ఫైనల్లో అత్యధిక స్కోర్ శ్రీకాంత్దే
టీమిండియా 1983 వన్డే వరల్డ్కప్ గెలిచినప్పుడు ఆ జట్టులో కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా సభ్యుడు. అంతేకాకుండా ఫైనల్లో వెస్టిండీస్తో జరిగిన పోరులో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీకాంత్ నిలిచాడు. ఆ మ్యాచ్లో శ్రీకాంత్ 38 పరుగులు చేశాడు. అలాగే టీమిండియా 1985 బెన్సన్ & హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ క్రికెట్ను గెలుచుకున్న జట్టులో కూడా శ్రీకాంత్ సభ్యుడు.

కెప్టెన్గా సేవలు
1989లో టీమిండియా కెప్టెన్గా శ్రీకాంత్ నియామకం అయ్యాడు. అతని కెప్టెన్సీలోనే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 1990లో శ్రీకాంత్ కెప్టెన్సీలో పాకిస్థాన్లో ఆడిన టెస్ట్ సిరీస్లోని అన్ని మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే బ్యాటర్గా నిరాశపరచడంతో శ్రీకాంత్పై సెలెక్టర్లు వేటు వేశారు. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ టీమిండిలో చోటు సంపాదించుకున్నాడు. వన్డే క్రికెట్లో హాఫ్ సెంచరీ చేయడంతోపాటు 5 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్ శ్రీకాంతే. 1988లో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. 1993లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.

శ్రీకాంత్ రికార్డులు
తన కెరీర్లో 43 టెస్టు మ్యాచ్లు ఆడిన కృష్ణమాచారి శ్రీకాంత్ 29 సగటుతో 2,062 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్రేట్ 75గా ఉండడం విశేషం. 146 వన్డే మ్యాచ్ల్లో 28 సగటుతో 4,091 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 123 కావడం గమనార్హం. మొత్తంగా భారత్ తరఫున 189 మ్యాచ్లు ఆడి 6,153 పరుగులు చేశాడు.

కోచ్గా సేవలు
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కృష్ణమాచారి శ్రీకాంత్ ఇండియా- ఎ జట్టుకు కోచ్గా పనిచేశాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అంబాసిడర్గా వ్యవహరించాడు. ఇక టీమిండియాకు చీఫ్ సెలెక్టర్గా కూడా విధులు నిర్వర్తించాడు. పలు స్పోర్ట్స్ చానల్స్లో మంచి వ్యాఖ్యాతగా రాణించాడు. ఇలా క్రికెట్కు కృష్ణమాచారి శ్రీకాంత్ అనేక సేవలు చేశాడు.

వ్యక్తిగత జీవితం
కృష్ణమాచారారి శ్రీకాంత్ చెన్నైలో 1959 డిసెంబర్ 21న జన్మించాడు. గిండి కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. విద్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు ఆదిత్య. రెండో వాడు అనిరుధ. అనిరుధ తండ్రిలాగే క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అలాగే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున కూడా ఆడాడు.


Click it and Unblock the Notifications












