
T20 ప్రపంచ కప్ 2022లో టీమ్ ఇండియా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోటీ పడనుంది. ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లు, దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి భారత్ సెమీ-ఫైనల్కు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ దానికి విరుద్ధంగా ఉన్నాడు.
30% మాత్రమే
ఈ టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలు తక్కువ అని అన్నారు. టాప్ 4లో చోటు దక్కించుకుంటేనే భారత్ అవకాశాలపై వ్యాఖ్యానించగలనని చెప్పాడు. "టీ20 క్రికెట్లో ఒక మ్యాచ్లో గెలిచిన జట్టు తదుపరి మ్యాచ్లో ఓడిపోవచ్చు.. భారత్ ప్రపంచకప్ను గెలుచుకునే అవకాశాల గురించి మాట్లాడటం చాలా కష్టం. సమస్య ఏమిటంటే వారు మొదటి నాలుగు స్థానాల్లో చేరగలరా? లేదా అని నేను ఆందోళన చెందుతున్నాను. వారు మొదటి నాలుగు స్థానాల్లోకి రావడం, అప్పుడు మాత్రమే ఏదైనా చెప్పగలం. నాకు, ఇండియా మొదటి నాలుగు స్థానాల్లోకి వచ్చే అవకాశం కేవలం 30% మాత్రమే" అని లక్నోలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో కపిల్ దేవ్ అన్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్లను కలిగి ఉన్న భారత్కు మంచి బ్యాటింగ్ అటాక్ ఉందని కపిల్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో కూడిన జట్టులో సూర్యకుమార్ లాంటి బ్యాటర్ ఉండటం వల్ల జట్టు ఆటోమేటిక్గా పటిష్టం అవుతుందని పేర్కొన్నాడు. కాగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన రెండో వార్మప్ టై వాష్ అవుట్ అయింది. బ్రిస్బేన్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.