
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికల్లో భారత మాజీ బ్యాటర్, కోచ్ సందీప్ పాటిల్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి అమోల్ కాలే విజయం సాధించారు. గతంలో కాలే MCA వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కోశాధికారిగా కొత్తగా ఎన్నికైన ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ కాలేకు మద్దతు ఇచ్చారు. పాటిల్పై కాలే 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 370 ఓట్లున్న ఎలక్టోరల్ కాలేజీలో కాలేకు 183 ఓట్లు రాగా, పాటిల్ 158 ఓట్లు సాధించారు.
అమోల్ కాలే
క్రికెట్కు పాటిల్ చేసిన సహకారాన్ని తాను గౌరవిస్తానని అమోల్ కాలే అన్నారు. అతని అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చూస్తానని చెప్పారు. ఎన్నికల సమయంలో మేం ప్రత్యర్థులమే తప్ప మిగతా సమయంలో ప్రత్యర్థులం కాదని.. సందీప్పై నాకున్న గౌరవం చెక్కుచెదరలేదని అన్నారు. "అతను భారతదేశానికి గొప్ప క్రికెటర్. అతని అనుభవాన్ని మరియు నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి మేము వెనుకాడము" అని కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ అమోల్ కాలే పేర్కొన్నారు.

అజింక్యా నాయక్
అనంతరం పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ తీర్పును సరైన స్ఫూర్తితో అంగీకరిస్తున్నట్లు తెలిపారు. "నేను వారిని అభినందిస్తున్నాను. వారు కోరుకున్న విధంగా వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను, నా బృందం ఈ ఓటమిని అంగీకరించాము. ఇది న్యాయమైన ఎన్నిక, నేను కొత్త సంస్థకు హృదయపూర్వకంగా మద్దతు ఇస్తాను." అని పాటిల్ చెప్పారు. మరో పాటిల్-ప్యానెల్ అభ్యర్థి, గత పాలకవర్గంలో మేనేజింగ్ కమిటీ సభ్యుడు అజింక్యా నాయక్ రికార్డు స్థాయిలో 286 ఓట్లు సాధించి కార్యదర్శి పదవిని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. సంఘంలోని శరద్ పవార్ ప్యానెల్ నాయక్కు మద్దతు ఇచ్చింది.