ముంబై: టీమిండియా మాజీ టెస్టు క్రికెటర్, మహారాష్ట్ర స్టంపర్ హేమంత్ కనిత్కర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పూణెలోని సొంత నివాసంలో జూన్ 9 (మంగళవారం) రాత్రి తుదిశ్వాస విడిచారని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
15 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉన్న కనిత్కర్ 1974-75 మధ్యకాలంలో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండిస్ జట్టు భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంలో టీమిండియా తరుపున రెండు టెస్టు మ్యాచ్లు ఆడారు. అమరావతిలో జన్మించిన కనిత్కర్ 1963-64, 1977-78 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర తరపున క్రికెట్కు ప్రాతినిధ్యం వహించారు.
హేమంత్ కనిత్కర్కు ఇద్దరు కుమారులు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించిన సమాచారం మేరకు కనిత్కర్ కుమారుడు హృషికేష్ కూడా టీమిండియా మాజీ ఆటగాడని తెలుస్తోంది. బంతిని అతి బలంగా కొట్టగలిగే వికెట్ కీపర్లలో హేమంత్ కనిత్కర్ ఒకరు.
మహారాష్ట్ర తరుపున రంజీల్లో ఆడిన హేమంత్ కనిత్కర్ 5,007 పరుగులు సాధించారు. ఇందులో 13 సెంచరీలను నమోదు చేశారు. 1970-71లో రాజస్ధాన్తో జరిగిన రంజీ మ్యాచ్లో అత్యధికంగా 250 పరుగులు చేశారు. సుమారు పదేళ్ల పాటు రంజీ క్రికెట్కు సేవలందించారు. బీసీసీఐ ఆల్ ఇండియా జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా కూడా సేవలు అందించారు.
హేమంత్ కనిత్కర్ మరణం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా తన సంతాపాన్ని ప్రకటించారు.