
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా వైరస్ బారిన పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో మాయదారి రోగం బారిన పడుతున్న జాబితా అంతకంతకు రెట్టింపు అవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అక్కడ నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి. మహమ్మారి ప్రభావంతో భారత మాజీ ఓపెనర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లాడు.
గౌతమ్ గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా టెస్టులకు గంభీర్ తన నమూనాలను పంపించాడు. అయితే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన గంభీర్.. తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరాడు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని, దీనిని తేలిగ్గా తీసుకోవద్దని సూచించాడు.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలకు చేరుకుంది. 1,24,985 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఢిల్లీలో నిన్న 6 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులను వినియోగించకుండా ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డేప్రపంచకప్ టీమిండియా గెలిచిన జట్టులో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సభ్యుడు. అంతేకాదు రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో గంభీర్ 58 టెస్టుల్లో, 147 వన్డేల్లో, 37 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలు చేశాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా 2012, 2014లో ట్రోఫీ అందించాడు. గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్ ఆటగాళ్ల ప్రదర్శనలపై తన అబిప్రాయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.