మాజీ భారత క్రికెటర్, త్రిపుర మాజీ ఆల్రౌండర్ రాజేష్ బానిక్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్తతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. భారత్ తరఫున అండర్-19 ప్రపంచ కప్లో ఆడిన రాజేష్ బానిక్.. 40 ఏళ్ల వయస్సులో పశ్చిమ త్రిపురలోని ఆనందా నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
రాజేష్ బానిక్ ఆనందానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను అగర్తలాలోని జీబీపీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన అకాల మరణం క్రికెట్ వర్గాలను షాక్కు గురిచేసింది.

క్రికెట్ ప్రస్థానం.. అనుభవం
రాజేష్ బానిక్ దేశవాళీ క్రికెట్లో త్రిపుర జట్టుకు నాయకత్వం వహించారు. రాజేష్ బానిక్ 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 19.32 సగటుతో 1469 పరుగులు చేశారు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2002-2003 రంజీ సీజన్లో ఆయన త్రిపుర తరఫున అరంగేట్రం చేశారు. ఆయన భారత అండర్-19 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2000 సంవత్సరంలో జరిగిన వరల్డ్ ఛాలెంజ్లో భారత అండర్-15 జట్టులో ఆయనకు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం లభించింది.
త్రిపుర క్రికెట్ అసోసియేషన్ సంతాపం
త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సుబ్రతా డే.. రాజేష్ బానిక్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఇంతటి ప్రతిభావంతుడైన క్రికెటర్ను, అండర్-16 క్రికెట్ జట్టు సెలెక్టర్ను కోల్పోవడం చాలా దురదృష్టకరం. మేము పూర్తిగా షాక్లో ఉన్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆయన రాష్ట్రంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరు. అంతేకాకుండా, యువ ప్రతిభను గుర్తించడంలో ఆయనకు మంచి పట్టు ఉండేది. అందుకే ఆయనను అండర్-16 జట్టు సెలెక్టర్గా నియమించాం," అని సుబ్రతా డే అన్నారు. త్రిపుర క్రికెట్కు చేసిన సేవలకుగాను రాజేష్ బానిక్ ఎప్పటికీ గుర్తుండిపోతారు.