భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతిచెందారు. ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు నుంచి జారిపడి మరణించారు. స్థానికులు హుటాహుటిన ఆసుప్రతికి తరలించినప్పటికీ 52 ఏళ్ల డేవిడ్ ప్రాణాలు కోల్పోయారు. డేవిడ్ జాన్సన్ మరణ వార్త విని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విటర్ వేదికగా సానుభూతి వ్యక్తం చేశారు.
''నా సహచర క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. 'బెన్నీ' చాలా త్వరగా వెళ్లిపోయావు'' అని కుంబ్లే ట్విటర్లో పోస్ట్ చేశాడు. ''భారత మాజీ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ జాన్సన్ కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి. ఆటకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది'' అని జైషా ట్వీటాడు.

డేవిడ్ జాన్సన్ గత కొన్నాళ్ల నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. గత వారం రోజులు ఆసుప్రతిలోనే గడిపారు. డిశ్చార్జ్ అయిన మూడు రోజులకే ప్రాణాలు కోల్పోయారు. టీమిండియా తరఫున డేవిడ్ జాన్సన్ రెండు టెస్టులే ఆడినప్పటికీ కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్లో సత్తాచాటారు. 1996లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశారు.
ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి డర్బన్లో టెస్టు ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఆయనకు అదే చివరి మ్యాచ్. కర్ణాటక తరఫున డేవిడ్ జాన్సన్.. శ్రీనాథ్, వెంకేటశ్ ప్రసాద్, దొడ్డ గేణేష్తో కలిసి ఆడారు. 1990 దశకంలో కర్ణాటక పవర్ఫుల్ పేస్ దళంగా సత్తాచాటడంలో జాన్సన్ది కీలకపాత్ర. అయితే కర్ణాటక స్టేట్ క్రికెట్ బోర్డు కర్ణాటక ప్రీమియర్ లీగ్ ప్రారంభించడంతో ఫస్ట్ క్లాస్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగి ఆడారు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డేవిడ్ జాన్సన్ 39 మ్యాచ్ల్లో 125 వికెట్లు పడగొట్టారు. 28.63 సగటు, 47.4 స్ట్రైక్రేటుతో ఈ ఫాస్ట్ బౌలర్ సత్తాచాటారు. బంతితో పాటు కీలక సమయాల్లో లోయర్ ఆర్డర్లోనూ బ్యాటుతోనూ రాణించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరిట ఓ శతకం ఉంది. 33 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 41 వికెట్లు సాధించారు. 2015లో కర్ణాటక ప్రీమియర్ లీగ్లో చివరిగా పోటీ క్రికెట్ ఆడారు.