టోర్నీ ఏదైనా భారత్ - పాక్ మ్యాచ్ జరిగిందంటే.. యావత్ భారత్ క్రికెట్ అభిమానులంతా, క్రికెటర్లంతా టీమిండియానే గెలవాలని ఆకాంక్షిస్తారు. ఇంకా చెప్పాలంటే మనోళ్లు గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తుంటారు. కానీ తాజాగా ఓ భారత మాజీ క్రికెటర్ మాత్రం.. పాకిస్థాన్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. తాను ఎందుకు అలా అన్నాడో కూడా కారణాన్ని వివరించాడు.
ఇంతకీ అతడెవరంటే?
టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్.. పాకిస్థాన్ గెలవాలని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరగబోయే మ్యాచ్ లో భారత్ పై దాయాది దేశం గెలవాలని పేర్కొన్నాడు. "నేను పాకిస్థాన్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ మంచి మజా ఉంటుంది. లేదంటే ఆసక్తి పోతుంది. పాకిస్థాన్ గెలవకపోతే మీరేం చేస్తారు? అదే పాకిస్థాన్ గెలిస్తే, టోర్నీ మరింత ఆసక్తిగా మారుతుంది." అని చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ లైనప్ అద్భుతం
టీమిండియా బ్యాటింగ్ డెప్త్ గా ఉందని ప్రశంసించాడు వాసన్. దుబాయ్ లో స్పిన్ పరిస్థితులకు తగ్గట్టుగా.. జట్టులో ఐదు స్పిన్నర్లను తీసుకోవడం మంచి నిర్ణయమని పేర్కొన్నాడు. "గిల్,రోహిత్,కోహ్లీ.. జట్టులో చాలా మంది అద్భుతమైన బ్యాటర్లు ఉన్నరు. 8వ స్థానం అక్షర్ పటేల్ వరకు అద్భుతంగా ఉంది. రోహిత్ ఐదుగురు స్పిన్నర్లు తీసుకున్నాడు. దుబాయ్ లో ఇదే బెస్ట్ టీమ్. మీపై(టీమిండియా) మీరు నమ్మకం ఉంచి ముందుకు సాగండి" అని చెప్పుకొచ్చాడు.
గంభీర్ పై అసంతృప్తి!
"గంభీర్ తన సొంత నిర్ణయంతో జట్టును ఎంపిక చేశాడు. పంత్ ను బెంచ్ కే పరిమితం చేయడంపై నేను అసంతృప్తి చెందాను. అతడు అద్భుతమైన ప్లేయర్. ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టగలడు. కానీ అతడిని ఎందుకు పక్కన పెట్టారో నాకు తెలీయలేదు. పంత్ ను ఆడిస్తే అతడొక్కడే సింగిల్ గా మ్యాచ్ ను గెలిపిస్తాడని వాళ్లు భావించారేమో. కేఎల్ రాహుల్ కూడా మంచి ఆటగాడే. కానీ పంత్ లా ప్రత్యర్థి జట్టును భయపెట్టలేడు. కాబట్టి మీరు మంచి ప్లేయర్ ను బరిలో దిగకపోతే అతడిలో ఉన్న హీరో.. జీరో అయిపోతాడు" అని వెల్లడించాడు.