తనకు చంపేస్తానని బెదిరింపు లేఖ వచ్చిందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. జనవరి 19వ తేదీన మిడ్నాపూర్లోని విద్యాసాగర్ యూనివర్సిటీలో జరగనున్న ఇంటర్ కాలేజీ క్రికెట్ మీట్కు హాజరు కావొద్దని బెదిరింపు వచ్చిందన్నాడు.
ఇది ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చింది. జనవరి 7వ తేదీన ఈ లేఖ వచ్చిందని చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు, యూనివర్సిటీ నిర్వాహకులకు చెప్పానన్నాడు. అయితే విద్యాసాగర్ యూనివర్సిటీ ప్రోగ్రాంలో పాల్గొనేదీ లేనిదీ గంగూలీ చెప్పలేదు.

తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. అక్కడ జరిగేది లైవ్ ప్రోగ్రాం అయినందున తాను పాల్గొనేదీ లేనిదీ అందరూ తెలుసుకోవచ్చునని చెప్పాడు.
ఈ బెదిరింపు లేఖ గంగూలీ తల్లి అడ్రస్ పేరుతో వచ్చింది. మీ కొడుకు ఈ ప్రోగ్రాంకు హాజరు కావొద్దని హెచ్చరిస్తున్నామని, తమ హెచ్చరికను పక్కన పెట్టి హాజరయితే మాత్రం మీ కొడుకును నీవు మళ్లీ చూసుకోలేవని గంగూలీ తల్లిని ఉద్దేశించి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ భారతి ఘోష్ మాట్లాడుతూ.. దీని గురించి తమకు తెలియదన్నారు.