
హైదరాబాద్: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళంలోకి ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరిన సంగతి తెలిసిందే. యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలోకి అధికారికంగా చేరినందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొనియాడారు. వీటి చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైటర్ 'పైలట్లు' అని ప్రశంసించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం యూఏఈలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. రఫేల్ యుద్ధ విమానాల చేరికపై ట్వీట్స్ చేశారు.
'పోరాటాల్లో అత్యుత్తమ పరాక్రమాన్ని ఘనంగా చాటుకున్న 4.5తరం యుద్ధ విమానాలను గొప్ప పైలట్లు నడుపుతారు. మన పైలట్ల సురక్షిత చేతుల్లో ఉండే ఈ లోహ విహంగాలు మిగతా యుద్ధ విమానాలతో కలిసి భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత పటిష్ఠంగా మారుస్తాయి' అని టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
'17వ స్క్వాడ్రన్ (గోల్డెన్ యారోస్)కు అభినందనలు. మిరేజ్ 2000 సేవా రికార్డులను రఫేల్ యుద్ధ విమానాలు బద్దలు కొడతాయనే అనుకుంటున్నా. అయితే సుఖోయ్ 30ఎంకేఐ మాత్రం ఎప్పటికీ నాకు ఇష్టమే. ఇవి సూపర్ సుఖోయ్గా ఉన్నతీకరణ చెందాలి. పైలట్లు వేచి ఉండండి' అని మరో ట్వీట్లో ఎంఎస్ ధోనీ ట్వీట్ చేశాడు. మరో క్రికెటర్ మనోజ్ తివారీ కూడా వాయుసేనకు అభినందనలు తెలియజేశాడు.
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్ దాదాపు 59 వేల కోట్ల రూపాయలతో ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో జులై 29న 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ రఫేల్ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్లో చేరాయి. రఫేల్ చేరికతో భారత ఎవైమానిక దళ సామర్ధ్యం మరింత బలోపేతమైంది.