గ్లోబల్ స్పోర్ట్స్ లో అత్యధిక సూసైడ్ రేట్ క్రికెట్ లోనే ఉందని సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప. తాను కూడా గతంలో టీమ్ లో ఉన్న పోటీతత్వం వల్ల మానసిన ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొన్నట్లు తెలిపాడు. క్రికెట్ లో కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదని, అంపైర్స్, బ్రాడ్ కాస్టర్స్ సహా పలు విభాగాలకు చెందిన సభ్యులు చాలా మంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు.
"నాకు తెలిసింది ఈ నిజం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడల్లో క్రికెట్ లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన నిజం. క్రికెట్ ఆడే ప్లేయర్స్ మాత్రమే కాదు ఈ క్రీడలో భాగమైన ఇతర సభ్యులు కూడా చాలా మంది ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్ కన్నా ఇండివిడ్యువల్ స్పోర్ట్. ఎందుకంటే మ్యాచ్ లో మీరు, మీ ఓపెనర్ పార్ట్నర్ తో పోటీ పడుతున్నట్టే, జట్టు బయట ఉన్న మూడో ఓపెనర్ తోనూ పోటీపడాల్సి ఉంటుంది. అలా 10-15ఏళ్ల పాటు పోటీ పడాలనే మైండ్ సెట్ తో కెరీర్ ను కంటిన్యూస్ గా కొనసాగిస్తే, అది చివరికి మిమ్మల్ని అత్యంత చీకటి ప్రాంతంలోకి నెట్టేస్తుంది." అని పేర్కొన్నాడు.

తాను 2009 - 2011 మధ్య మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నాడు రాబిన్ ఉతప్ప. ఆ సమస్య నుంచి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ గ్రహమ్ థోర్ప్, టీమిండియా మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలను గుర్తుచేశాడు. జీవితం అలా ముగిసిపోకూడదని అన్నాడు. "2011లో నేనెందుకు మనిషిగా పుట్టానా అని సిగ్గుపడ్డాను. ఒకానొక దశలో నెక్ట్స్ ఏం చేయాలో తెలీక సతమతమవుతాం. నేను కూడా అంతే. కానీ ఆ తర్వాత దాని నుంచి బయటపడ్డాను." అని చెప్పుకొచ్చాడు.
కాగా, రాబిన్ ఉతప్ప తన తొమ్మిదేళ్ల కెరీర్ లో 59 వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అలానే సౌతాఫ్రికాలో 2007 టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.