
హైదరాబాద్: 33 ఏళ్ల హైదరాబాద్ మాజీ ఫాస్ట్ బౌలర్ అశ్విన్ యాదవ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన శనివారం మరణించారు. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అశ్విన్కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. అశ్విన్ మరణంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే అశ్విన్ గుండెపోటుతో మరణించడంతో క్రీడాలోకం విచారం వ్యక్తం చేస్తోంది.
అశ్విన్ యాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 మ్యాచ్లు ఆడి 34 వికెట్లు పడగొట్టారు. 2007లో మొహాలీలో జరిగిన రంజీ ట్రోఫీలో పంజాబ్తో జరిగిన మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. 2008-09 సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఓ రంజీ మ్యాచ్లో ఢిల్లీపై 52 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టారు. చివరిగా 2009లో ముంబైతో రంజీ మ్యాచ్ ఆడారు. అనంతరం అశ్విన్కు తగినన్ని అవకాశాలు రాకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరఫున స్థానిక క్రికెట్ ఆడుతున్నారు.
అశ్విన్ యాదవ్ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండేవారని అతని సహచరుడు, రంజీ మాజీ ఆఫ్ స్పిన్నర్ విశాల్ శర్మ తెలిపారు. అశ్విన్ జిమ్లో రెగ్యులర్గా కసరత్తులు చేసేవారని, స్థానిక క్రికెట్లో ఆడుతూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేవారన్నారు. పరుగులు ఇచ్చినా, వికెట్ పడగొట్టిన అతడు ఒకేలా ఉండేవారని శర్మ తెలిపాడు. అశ్విన్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విశాల్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
అశ్విన్ యాదవ్ అవుట్ స్వింగ్ చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని అతడి కోచ్ కిషన్ లాల్ చెప్పారు. అశ్విన్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక హైదరాబాదీ బౌలర్ అశ్విన్ యాదవ్ మరణవార్త విని చాలా నిరాశకు గురయ్యాయని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ట్వీట్ చేశారు. అశ్విన్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ దేవుడిని కోరుకున్నారు.