మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా వాయిదా పడి భారత క్రికెట్ జట్టుకు మేలు చేసిందని ఇంగ్లండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, భారత సంతతికి చెందిన మాంటీ పనేసర్ అన్నారు. అనూహ్యంగా లభించిన ఈ వాయిదా టీమిండియాను ఫైనల్కు చేర్చుతుందని ఆయన చెప్పారు. ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ ఎలాంటిదో భారత క్రికెటర్లకు బాగా తెలుసని, ఏ వాతావరణంలో పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయంపై భారత క్రికెటర్లకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఈ పిచ్పై భారత జట్టు 250 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించగలదని మాంటీ పనేసర్ అంచనా వేశారు.
వరుణుడు వర్సెస్ కోహ్లీసేన: సేఫ్ జోన్లోనే ఉన్నా..ఓవర్లు కుదిస్తే చెమటోడ్చాల్సిందే!
మ్యాచ్ రెండో రోజు పిచ్ పరిస్థితి గురించి టీమిండియా ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ భారత క్రికెటర్లకు కొట్టిన పిండే గనక.. బంతి స్వింగ్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఎక్కువగా ఆలోచించకూడదని అన్నారు. ఇంకా 23 బంతులు మిగిలే ఉన్నందునన.. న్యూజిలాండ్ జట్టు 250 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించలేదని చెప్పారు. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్కు పెద్ద కష్టతరమేమీ కాదని, భారీ షాట్లకు వెళ్లి వికెట్లను పడేసుకోకూడదని పనేసర్ అన్నారు. పిచ్లో తేమను న్యూజిలాండ్ బౌలర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటే భారత బ్యాట్స్మెన్లు పరుగుల కోసం కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 46.1 ఓవర్లను ఎదుర్కొన్న తరువాత వర్షం పడిన విషయం తెలిసిందే. ఫలితంగా మ్యాచ్ను రిజర్వ్ డే అయిన బుధవారానికి వాయిదా వేశారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు రాస్ టేలర్, టామ్ లాథమ్ క్రీజులో ఉన్నారు. 46.1 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి బ్లాక్ క్యాప్స్ 211 పరుగులు చేశారు. ఆ దశలో వర్షం రావడం వల్ల మ్యాచ్ను రిజర్వడేకు వాయిదా వేశారు.