రోహిత్పై ప్రశంసలు
లెజెండ్స్ లీగ్ సందర్భంగా ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కెవిన్ పీటర్సన్ టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్గా రోహిత్ శర్మ అద్బుతమైన నిర్ణయాలు తీసుకుంటాడని కొనియాడాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ సాధించిన రికార్డులే అతని గురించి చెబుతున్నాయన్నాడు. రోహిత్ శర్మ సరైన ఫిట్నెస్ సాధిస్తే ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న అతడినే టీమిండియాకు టెస్టు కెప్టెన్గా నియమించాలని సూచించాడు.
రోహిత్ గొప్ప నాయకుడు
"టీమిండియాకు మంచి అదృష్టం ఉంది. టీమిండియాకు కెప్టెన్ను నియమించడానికి చాలా మంది ఉన్నారు. అయితే నేను టెస్ట్ కెప్టెన్గా ఇద్దరి పేర్లనే చెబుతాను. పంత్ టెస్టులకు కెప్టెన్గా అవసరం లేదు. వన్డే జట్టుకు అయితే సరే అనుకోవచ్చు. రోహిత్, రాహుల్లకు అయితే సరే అని చెబుతాను. కానీ నేను రోహిత్ శర్మకే మద్దతు ఇస్తాను. రోహిత్ శర్మ గొప్ప నాయకుడు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు అతను చాలా టైటిల్లు అందించాడు. ప్రస్తుతం హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ టెస్టు కెప్టెన్గా యువకులను తీసుకుంటాడా లేక సీనియర్లను తీసుకుంటాడో వేచి చూడాలి" అని పీటర్సన్ చెప్పాడు.
కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యం కల్గించలేదు
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఒక ఎంటర్టైనర్ అని పీటర్సన్ అన్నాడు. ఎలాంటి ఆటగాడైనా బయోబబుల్స్లో జీవించడం కష్టమన్నాడు. అది ఆటగాళ్లను మాత్రమే కాకుండా వారి కుటుంబాలను కూడా దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ చాలా కాలంగా బయోబబుల్లో ఉంటున్నాడని, అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని పీటర్సన్ చెప్పుకొచ్చాడు. అందుకే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పట్ల నేను ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదని చెప్పాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
ఇటీవల సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన అనంతరం విరాట్ కోహ్లీ భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక అంతకుముందే టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మొత్తం ఏడేళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ఈ క్రమంలో భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీపై అనేక మంది ప్రశంసలు కురిపించారు.