
మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్కు ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం పిచ్ తీరుపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఈ పిచ్పై విమర్శలు రావడం ఈ టోర్నమెంట్ మొత్తానికీ ఇదే తొలిసారి. ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లో సెమీఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేయాల్సిన పిచ్ ఎంత మాత్రం కాదని ఇంగ్లండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ మార్క్ బుచర్, ఫస్ట్ క్లాస్ మాజీ ఆటగాడు గ్రీమ్ ఫ్లవర్ అభిప్రాయపడ్డారు. చాలా నాసిరకమైన పిచ్ను తయారు చేశారని, దీనికి ఏదో ఒక జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఇంత నాసిరకమా?
లాంకషైర్ తరఫున 150కి పైగా వన్డే మ్యాచ్లను ఆడిన గ్రీమ్ ఫ్లవర్కు ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ సొంత గడ్డ లాంటిది. ఈ స్టేడియంలో అతను వందకుపైగా వన్డేలను ఆడాడట. ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్పై తాను అనేక మ్యాచ్లను ఆడానని, ఇంత నాసిరకమైన పిచ్ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని గ్రీమ్ ఫ్లవర్ అన్నారు. నాణ్యమైన క్రికెట్ను ఆడగల ఏ జట్టు అయినా ఈ పిచ్పై పరుగుల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఏర్పడటానికి పిచ్ స్వభావమే కారణమని చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్ ఒక్కటే కాకుండా.. ఛేజింగ్ సమయంలో టీమిండియా కూడా పరుగుల కోసం కష్టపడక తప్పదని గ్రీమ్ ఫ్లవర్ అభిప్రాయపడ్డారు.
చెత్తగా మార్చారు..
ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ను చెత్తగా మార్చివేశారని ఇంగ్లండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ మార్క్ బుచర్ అన్నారు. ఇంగ్లండ్ తరఫున 71 టెస్ట్ మ్యాచ్లను ఆడిన మార్క్ బుచర్ ఖాతాలో నాలుగు వేలకు పైగా పరుగులు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 173. టీమిండియాపైనా పలు మ్యాచ్లను ఆడాడు మార్క్ బుచర్. ఓల్డ్ ట్రాఫొర్డ్ పిచ్ ఇంతకుముందు నాణ్యమైనదే అయినప్పటికీ.. సెమీఫైనల్ మ్యాచ్ కోసం దీన్ని రూపొందించిన విధానం బాగోలేదని అన్నారు. పిచ్ను చెత్తగా తయారు చేశారని విమర్శించారు. ఈ పిచ్పై భారత క్రికెట్ జట్టు కూడా పరుగుల కోసం కష్టపడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.