
చెన్నై జట్టుకు ఘన చరిత్ర
2008లో ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభమైనప్పటి నుండి చెన్నై జట్టుకు ధోనీ నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో చెన్నై ఒక్కసారి మినహా ప్రతిసారి ప్లేఆఫ్స్కు చేరుకుంది. నాలుగు సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యుత్తమ జట్టుగా చెన్నై నిలిచింది. 15వ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ.. జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాడు. ఈ సీజన్లో జడేజా నాయకత్వంలో చెన్నై ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఆరు ఓటములను చవిచూసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కెప్టెన్గా పేలవమైన ప్రదర్శనను అనుసరించి జడేజా ధోనీని మరోసారి కెప్టెన్సీ చేయాలని కోరగా.. ధోనీ అంగీకరించాడు.

నేను మొదటి రోజు నుంచే చెప్పా : సెహ్వాగ్
'ఎంఎస్ ధోనీ కెప్టెన్గా లేకపోతే చెన్నై జట్టు నుంచి ఏమీ ఆశించలేమని నేను మొదటి రోజు నుండి చెబుతూనే ఉన్నా. ఇప్పటికైన మించిపోయింది ఏమి లేదు. కాస్త ఆలస్యంగా జడ్డూ నిర్ణయం తీసుకున్నా.. చెన్నైకి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలున్నాయి. వారి చేతిలో ఇంకా 6మ్యాచ్లున్నాయి. ఇప్పుడు చెన్నై ఆట మలుపు తిరగొచ్చు' అని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

ధోనీ జట్టులో ఉంటే కెప్టెన్గా ఉండాల్సిందే
'రవీంద్ర జడేజాను కెప్టెన్గా ఎంపిక చేసినప్పుడు సరైన నిర్ణయమని అనుకోలేదు. ఇప్పుడు అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతనికి తప్పుకోవడం తప్పా వేరే ఆప్షన్ కూడా లేదు. జట్టులో ధోనీ ఉంటే కెప్టెన్గా ధోనీ ఉండాల్సిందే. 2019ప్రపంచకప్ టైంలో కూడా భారత్కు కెప్టెన్గా ధోనీ ఉండాలని చెప్పాను. తన నిర్ణయం పట్ల జడేజా కూడా సంతోషంగా ఉన్నాడని అనుకుంటాను. కెప్టెన్సీ అంటే నిజంగా జడేజా భుజంపై భారీ భారం' అని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. రవీంద్రా జడేజా తీసుకున్న ఈ నిర్ణయం ఓ క్రికెటర్గా అతనిపై ప్రతికూల ప్రభావం చూపొద్దని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. జడేజా కోసం కాస్త ఫీల్ అవుతున్నానని, జడ్డూకు సరైన టైం వస్తుందని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications

