
ఈ ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ భారత ఆటగాళ్లను హెచ్చరించాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ నుంచి టీమిండియా బ్యాటర్లకు సవాల్ తప్పదని అన్నాడు. సౌతాఫ్రికాకు మంచి పేస్ బౌలింగ్ అటాక్ ఉందని ఈ సందర్భంగా జాఫర్ చెప్పుకొచ్చాడు. రబాడ రూపంలో ఆ జట్టులో బలమైన బౌలర్ ఉన్నాడని, అతను అత్యుతమ బౌలర్ అని కొనియాడాడు. రబాడ నాణ్యమైన బౌలర్ అని, అతని నుంచి భారత ఆటగాళ్లకు సవాల్ తప్పదని అన్నాడు.
అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా మరొక కీలక పేసర్ అన్రుచ్ నోర్జే ఈ సిరీస్కు దూరమయ్యాడు. నోర్జే లేకపోయినప్పటికీ సఫారీల పేస్ దళం బలంగా ఉందని, భారత బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవని చెప్పాడు. అయితే బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ సౌతాఫ్రికా బ్యాటింగ్ గతంలో మాదిరిగా బలంగా లేదని అన్నాడు. ఏది ఏమైనా సౌతాఫ్రికా పర్యటన భారత్కు సవాళ్లతో కూడినదని చెప్పుకొచ్చాడు. నాణ్యమైన దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొని మన బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారనేది కీలకం అని చెప్పుకొచ్చాడు.
గత 2018 సౌతాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ ఒక్కడే బాగా రాణించాడని అన్నాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ కొద్ది సేపు క్రీజులో ఉంటే మ్యాచ్ ఫలితాన్నే మార్చగలడని చెప్పాడు. బ్యాటర్లంతా సమిష్టిగా రాణించాలని జాఫర్ సూచించాడు. బ్యాటర్లు ఒక 400 పరుగులు చేస్తే మ్యాచ్ టీమిండియానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ప్రస్తుతం మన బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు టీమ్లో ఉన్నారన్నాడు.
కాగా 2006లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టులో వసీం జాఫర్ ఒక సభ్యుడు. అంతేకాకుండా జాఫర్ అక్కడ ఒక సెంచరీ కూడా చేశాడు. భారత జట్టు తరఫున 31 టెస్ట్ మ్యాచ్లు ఆడిన జాఫర్.. 34 సగటుతో 1944 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు సార్లు డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212 పరుగులు. 2 వన్డే మ్యాచ్లు కూడా ఆడిన జాఫర్ 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇక 8 ఐపీఎల్ మ్యాచ్ల్లో 16 సగటుతో 130 పరుగులు చేశాడు. అత్యధికంగా ఓ సారి 50 పరుగులు చేశాడు.