
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలోని ప్రస్తుత భారత జట్టు సెలెక్షన్ విధానాన్ని భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. వెస్టిండీస్ పర్యటన కోసం వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించాక.. పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు జట్టు ఎంపిక విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
విశ్రాంతి తీసుకుంటే ఫామ్లోకి వస్తారనడం భ్రమలేనని చాలా మంది క్రికెట్ మాజీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక వెస్టిండీస్ పర్యటనలో శిఖర్ ధావన్ భారత వన్డే జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మిగతా సీనియర్ ఆటగాళ్లందరూ విశ్రాంతి మోడ్లోకి వెళ్లనున్నారు.
బీసీసీఐ సెలెక్షన్ విధానాన్ని వెంకటేష్ ప్రసాద్ ఏకిపారేశాడు. సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజాలు కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డప్పుడు జట్టులో చోటు కోల్పోయారని చెప్పాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా వారిని ఫామ్లోకి తీసుకురాలేరు అని ప్రసాద్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు వారి రిప్యూటేషన్ బట్టి ఎంపిక కావడం కరెక్ట్ కాదన్నాడు. 'ఫామ్లో లేనప్పుడు.. ఆటగాడి పేరుప్రతిష్టలతో సంబంధం లేకుండా జట్టులో చోటు కోల్పోతారు.
సౌరవ్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్, భజ్జీ అందరూ ఫామ్లో లేనప్పుడు తప్పుకున్నారు. వారు డొమెస్టిక్ క్రికెట్లో ఆడి మళ్లీ ఫామ్ అందుకుని జట్టులోకి పునరాగమనం చేశారు. ఫామ్లో లేకపోతే బాగా విశ్రాంతి ఇచ్చి వారికి వంత పాడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది పురోగతికి మార్గం కాదు. దేశంలో ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. వారు వాళ్లకు పేరుప్రతిష్టలు రాకపోవడంతో ఇక ఎప్పటికీ ఆడలేరు. భారత జట్టు గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరైన అనిల్ కుంబ్లే కూడా చాలా సందర్భాలలో బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చింది. జట్టు కోసం అలాంటి చర్యలు అవసరమవుతాయి' అని తన ట్విట్టరులో వెంకటేష్ ప్రసాద్ పోస్ట్ చేశాడు.