Suresh Raina: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కజిన్ సౌరభ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో సౌరభ్ సహా మరో ఇద్దరు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో గల గగల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. వారు ప్రయాణించిన కారు అదుపు తప్పి తొలుత స్కూటర్ను ఢీ కొట్టింది. అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేష్ రైనా కజిన్ సౌరభ్, అతని స్నేహితులు శుభమ్, ఖాతుమ్ తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి వాళ్లు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు కాంగ్రా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షాలిని అగ్నిహోత్రి తెలిపారు.
ప్రమాదం సంభవించిన వెంటనే కారు డ్రైవర్ షేర్ సింగ్.. పరారయ్యాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీల ద్వారా అతని కదలికలను గుర్తించారు. మండీకి పారిపోయినట్లు నిర్ధారించారు. అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా షేర్ సింగ్ను అరెస్ట్ చేసినట్లు షాలిని చెప్పారు. ఐపీసీలోని సెక్షన్ 279, 304 ఏ, మోటార్ వెహికల్ యాక్ట్లోని సెక్షన్ 187 కింద డ్రైవర్పై కేసులు నమోదు చేశారు.