ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా అమ్ముడుపోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మిస్టర్ ఐపీఎల్గా పేరు తెచ్చుకున్న రైనాను వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం ఎవరికీ మింగుడు పడడంలేదు. ఈ క్రమంలో సురేష్ రైనా అమ్ముడుపోకపోవడానికి గల రెండు మూడు కారణాలను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ విశ్లేషించాడు. 2020లో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లో సురేష్ రైనా అన్ని జట్ల నమ్మకాన్ని కొల్పోయాడని చెప్పుకోచ్చాడు.
ఆ సంవత్సరం టోర్నీ ప్రారంభం కాకుండానే అతను ఇండియాకు తిరిగొచ్చిన అంశాన్ని ఆయన గుర్తు చేశాడు. అలా ఎందుకు తిరిగొచ్చాడనే అంశాన్ని పక్కనపెడితే దాంతో రైనా సీఎస్కేతోపాటు అన్ని జట్ల నమ్మకాన్ని కోల్పోయాడని చెప్పాడు. అలాగే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నమ్మకాన్ని కూడా రైనా కోల్పోయాడని సైమన్ డౌల్ తెలిపాడు. ఎవరైనా ఒక సారి ఇలా చేస్తే, అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఓ క్రీడా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో రైనాను మెగా వేలంలో సీఎస్కేనే కాకుండా ఇతర జట్లు కూడా కొనుగోలు చేయలేదని అభిప్రాయపడ్డాడు.
కాగా మెదటి నుంచి ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సురేష్ రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా మళ్లీ చెన్నై దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇతర జట్లు ఏవి కూడా రైనాను తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ వెటరన్ బ్యాటర్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. దీంతో రైనా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్లో ధోని తర్వాత చిన్న తలాగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై లేని రెండు సీజన్లు మినహా అన్ని సార్లు ఆ జట్టుకే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో రైనా సభ్యుడిగా ఉన్నాడు.
మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లను మళ్లీ కొనుగోలు చేసింది. మెగా వేలానికి ముందు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు 205 మ్యాచ్లు ఆడిన సురేష్ రైనా 30కి పైగా సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఓ సారి సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు.