
కొలంబో: శ్రీలంక అట్టుడుకుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రోజులు గడుస్తున్నప్పటికీ.. ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సను లక్ష్యంగా చేసుకుని వారు నినాదాలు చేశారు. ఆయన భవనాన్ని ముట్టడించారు. భద్రతను సైతం లెక్క చేయలేదు. మూడంచెల భద్రత వలయాన్ని ఛేదించుకుని మరీ..అధ్యక్షుడి అధికార నివాసంలోకి దూసుకెళ్లారు.
దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన గొటబయ.. తన నివాసాన్ని వదిలి పెట్టి పారిపోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ అంబులెన్స్లో పరార్ అయ్యారు. నౌకాదళానికి చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహులో ఆయన తప్పించుకుని పారిపోయినట్లు వార్తలొస్తోన్నాయి. ఓ భారీ లగేజీ బ్యాగ్తో గొటబయ రాజపక్స.. గజబాహు షిప్ను ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.
ఈ పరిణామాలపై శ్రీలంక మాజీ ఆల్రౌండర్ సనత్ జయసూర్య స్పందించారు. గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టిన ఆందోళనకారులకు ఆయన మద్దతు ఇచ్చారు వారితో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులతో ఫొటోలు దిగారు. వాటిని తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గొటబయ రాజపక్సను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు సనత్ జయసూర్య.
నీ సామ్రాజ్యం కుప్పకూలిపోయిందంటూ వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. రాజపక్స కుటుంబ పరిపాలన అంతమైపోయిందని అన్నారు. దీనికి సంబంధించిన వేడుకల్లో తాను పాల్గొంటానని హామీ ఇచ్చారు. చేతగాని పరిపాలను ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని, దానికి నిదర్శనమే ఈ తిరుగుబాటు అని చెప్పారు. శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కార, మహేల జయవర్దనె సైతం గొటబయకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.