హైదరాబాద్: భారతీయ జనత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఆరంభమైంది. ఈ ఉదయం ఆయన హైదరాబాద్కు వచ్చారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికను ఎదుర్కొంటోన్న నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ నిర్వహించనున్న పదాధికారుల సమావేశంలో పాల్గొననున్నారు.
ప్రస్తుతం బీజేపీ దృష్టి మొత్తం తెలంగాణ మీదే ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ అందుబాటులో ఉన్న అన్ని వనరులు, అవకాశాలను వినియోగించుకుంటోంది. ఏ ఒక్కటీ వదులుకోదలచుకోలేదు. మొన్నటికి మొన్నే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించారు. అనూహ్య పరిస్థితుల మధ్య యంగ్ టైగర్ జూనియన్ ఎన్టీఆర్తోనూ కలిశారు.
అమిత్ షా పర్యటన ముగించుకున్న అతి కొద్దిరోజుల్లోనే జేపీ నడ్డా కూడా హైదరాబాద్లోనే మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్కు చేరుకున్న ఆయనను భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మిథాలి రాజ్.. భేటీ అయ్యారు. ఇది ఎవ్వరూ ఊహించనిదే. నిజానికి- టాలీవుడ్ హీరో నితిన్.. జేపీ నడ్డాను కలుస్తారనే ప్రచారం జరిగింది. అంతకంటే ముందే మిథాలి రాజ్.. జేపీ నడ్డాను కలిశారు.
పొలిటికల్ సర్కిల్స్లో ఉన్న టాక్ ప్రకారం చూసుకుంటే బీజేపీ హైకమాండ్.. ఏ కారణం లేకుండా ఎవ్వరితోనూ కలవడానికి పెద్దగా ఇష్టపడదు. అలాంటిది- రాజకీయ కారణాలతో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జేపీ నడ్డాను మిథాలి రాజ్ కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మిథాలి రాజ్ను లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇప్పటికే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ తరఫున లోక్సభకు ఎన్నికయ్యారు. అదే దారిలో మిథాలి రాజ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.