న్యూజిల్యాండ్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్లో భారత్ ఎలాగైనా గెలవాల్సిందే. లేదంటే టీ20 సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. తొలి టీ20లో భారత జట్టు 21 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ముందు రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అంటున్నాడు.
టీమిండియాకు బ్యాటుతో మంచి ఆరంభాలే దక్కడం లేదని చోప్రా విమర్శించాడు. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ ఇద్దరూ కూడా జట్టుకు సరైన ఓపెనింగ్ ఇవ్వలేకపోతున్నారు. పృథ్వీ షా ఉన్నా కూడా అతనికి తొలి వన్డేలో అవకాశం ఇవ్వలేదు. ఆ మ్యాచ్లో ఓపెనర్లతోపాటు రాహుల్ త్రిపాఠీ కూడా విఫలమవడంతో జట్టు చాలా కష్టాల్లో పడింది.
ఇదే విషయాన్ని చెప్పిన చోప్రా.. 'భారత్కు బ్యాటుతో మంచి ఓపెనింగ్.. బంతితో మంచి ఫినిషింగ్ ఏదీ దక్కడం లేదు. ఇదే పెద్ద సమస్య' అన్నాడు. తొలి టీ20లో చివరి ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.
ఇక బ్యాటింగ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో బౌలింగ్ గురించి మాట్లాడిన చోప్రా.. కొత్త బంతితో హార్దిక్ పాండ్యా, శివమ్ మావి బౌలింగ్ చేస్తే మంచిదన్నాడు.
తొలి టీ20లో కూడా భారత బౌలింగ్ను పాండ్యనే ప్రారంభించాడు. 'పాండ్యా, శివమ్ మావి ఇద్దరూ కొత్త బంతిని పంచుకోవాలి. మావిని కొత్త బంతితో బౌలింగ్ చేయించలేదంటే.. అతన్ని సరిగా ఉపయోగించుకోలేదనే అర్థం' అని ఆకాష్ చోప్రా తేల్చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అయితే ఎప్పుడైనా బౌలింగ్ చేయగల సమర్ధులని కితాబిచ్చాడు.