
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఫర్వాలేదనిపించిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్లో తమకు దక్కిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంది. భారత్ ముందు భారీ లక్ష్యం లేకపోయినా.. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో భారత జట్టు విజయం సాధించడం కోసం చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతోంది.
ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ జట్టు పైచేయి సాధించింది అనే కంటే భారత్ వెనుక బడిందని అనడం సబబని వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అన్నాడు. భారత జట్టు ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించిందని, చాలా క్యాచులు వదిలేశారని విమర్శించాడు. భారత బౌలర్లు బాగానే అవకాశాలు సృష్టించారని, కానీ ఆ అవకాశాలను జట్టు అందిపుచ్చుకోలేకపోయిందని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి చిన్న చిన్న క్షణాలే చాలా ముఖ్యమని చెప్పాడు. ఒక బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ వదిలేసి అతనికి మరొక అవకాశం ఇవ్వడం పెద్ద పొరపాటన్నాడు.

అంతకుముందు శ్రేయాస్ అయ్యర్ కూడా తనకు దక్కిన అవకాశాన్ని అలాగే ఉపయోగించుకున్నాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన దినేష్ కార్తీక్.. బంగ్లా బ్యాటర్ లిటాన్ దాస్ కూడా అదే పని చేశాడని చెప్పాడు. వ్యక్తిగత స్కోరు 20, 49 వద్ద అతని క్యాచులను భారత ఫీల్డర్లు జారవిడిచారు. ఈ అవకాశాలను యూజ్ చేసుకున్న అతను లోయర్ ఆర్డర్తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడని వివరించాడు.
కేవలం బౌలర్లను తప్పుబట్టడం కరెక్ట్ కాదని, భారత బ్యాటింగ్లో చాలా లోపాలున్నాయని అన్నాడు. 'పంత్, అయ్యర్ భాగస్వామ్యం తర్వాత కానీ, దానికి ముందు కానీ భారత జట్టులో పెద్ద భాగస్వామ్యాలే లేవు. ఇలా కేవలం ఒక పెద్ద భాగస్వామ్యంతో టెస్టుల్లో మంచి స్కోర్లు చెయ్యలేం. భారత్ ముందు ఉన్న అతి పెద్ద సమస్య ఇదే' అని స్పష్టం చేశాడు.