
హైదరాబాద్: ఓ అల్లరి మూక దాడిలో ఢిల్లీలో టీమిండియా మాజీ పేసర్ అమిత్ భండారి తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్ర అండర్-23 జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఉన్న భండారి యువ క్రికెటర్ల ఆటని పరిశీలిస్తున్న సమయంలో ఈ దాడి ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనలో అమిత్ భండారి తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. జట్టులోకి ఎంపికవని ఓ యువ క్రికెటర్ తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ అండర్-23 టీమ్ మేనేజర్ శంకర్ సైనీ వెల్లడించిన వివరాల ప్రకారం "టీమ్ ట్రయల్స్ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని అన్నారు.
"కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా ఓ 15 మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. అదే సమయంలో అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే భండారీని వారు గాయపర్చారు. ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్తూ.. జట్టులోకి తీసుకోలేదో? కాల్చి పారేస్తాం అని భండారీని హెచ్చరించారు" అని ఆయన తెలిపారు.