హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త పాలకులను సోమవారం సుప్రీం కోర్టు ప్రకటించింది. బీసీసీఐ రోజువారీ కార్యకలాపాలు చూసేందుకు నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది.
సుప్రీం కోర్టు ప్రకటించిన పాలకమండలి సభ్యులలో కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఐడీఎఫ్ సీ అధికారి విక్రమ్ లిమాయె, మహిళ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలు ఉన్నారు. ఈ కమిటీకి వినోద్ రాయ్ సారథ్యం వహిస్తారు. ఈ మేరకు సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫిబ్రవరి మొదటి వారంలో ఐసీసీ సమావేశానికి బీసీసీఐ తరుపున జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి, విక్రమ్ లిమాయేలు ప్రాతినిధ్యం వహిస్తారని సుప్రీం కోర్టు వెల్లడించింది. కొత్త కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు సుప్రీం చోటు కల్పించలేదు.
కేవలం మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ డయానాకు చోటు కల్పించింది. దీనిని ఒక గౌరవంగా భావిస్తున్నానని, ఇది తనపై పెద్ద బాధ్యతను మోపిందని డయానా ఎడుల్జీ వ్యాఖ్యానించింది. ఇక మిగిలిన ముగ్గురు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు.
ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గత విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ 9 మంది పేర్లను సీల్డ్ కవర్లో అందజేసింది. అప్పుడే సభ్యులను ప్రతిపాదించే అవకాశాన్ని కేంద్రంతోపాటు బీసీసీఐకి కూడా కోర్టు కల్పించింది.