
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ కన్నుమూశారు. గత గురువారం క్వీన్స్లాండ్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న 74 ఏళ్ల మార్ష్కు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రాడ్ మార్ష్ నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మార్ష్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం సంతాపం తెలుపుతోంది. అనేక మంది ఆటగాళ్లు మార్ష్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లో మార్ష్ ఒకరు. 1970 నుంచి 1984 మధ్య కాలంలో అంటే 15 సంవత్సరాలపాటు అంతర్జాతీయ క్రికెట్లో మార్ష్ ఆడారు.
తన క్రికెట్ కెరీర్లో రాడ్ మార్ష్ 96 టెస్టు మ్యాచ్లు, 92 వన్డే మ్యాచ్లు ఆడారు. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మార్ష్ వికెట్ కీపర్గా తన టెస్టు కెరీర్లో 355 మందిని ఔట్ చేశాడు. ఆయన రిటైర్ అయ్యే సమయానికి అత్యధిక మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్ల రికార్డు మార్ష్ పేరు మీదనే ఉన్నది. అలాగే టెస్టు క్రికెట్లో సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియా వికెట్ కీపర్గా కూడా మార్ష్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా 92 టెస్టు మ్యాచ్ల్లో మార్ష్ బ్యాటర్గా 3633 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 132 పరుగులుగా ఉంది. ఇక 92 వన్డే మ్యాచ్ల్లో 20 సగటుతో 1225 పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోర్ 66 పరుగులుగా ఉంది.
1984లో క్రికెట్కు వీడ్కోలు పలికిన రాడ్ మార్ష్ ఆ తర్వాత కామెంటేటర్గా, కోచ్గా రాణించారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్గా కూడా పని చేశాడు. 2014లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మార్ష్.. ఆ పదవిలో 2 సంవత్సరాలు కొనసాగారు. కాగా రాడ్ మార్ష్ మృతికి సంతాపంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తొలి టెస్టు మ్యాచ్లో ఆసీస్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాడ్జ్లు కట్టుకోని బరిలోకి దిగనున్నారు.