
అడిలైడ్: ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ బారీ జార్మన్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. అడిలైడ్లో నివాసం ఉంటున్న జార్మన్ శనివారం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో.. ఆసుపత్రికి తరలించేలోగా ఆయన మృతి చెందారు. మాజీ టెస్ట్ వికెట్ కీపర్ బారీ జార్మన్ శనివారం మరణించినట్లు దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
బారీ జార్మన్ 1959 నుంచి 1969 వరకు ఆస్ట్రేలియా తరఫున 19 టెస్టులు ఆడారు. జార్మన్ 1968 యాషెస్ పర్యటనలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు 33వ కెప్టెన్గా వ్యవహరించారు. యాషెస్ పర్యటనలో రెగ్యులర్ క్యాప్టిన్ బిల్ లారీ గాయపడినప్పుడు జర్మన్ ఒక టెస్టుకు నాయకత్వం వహించారు.1959లో భారత జట్టుతో జరిగిన టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్.. ఈ ఫార్మెట్లో సుదీర్ఘంగా ఆడారు. వికెట్ కీపర్గానూ ఆస్ట్రేలియా జట్టుకు ఆయన సేవలందించారు.
బారీ జార్మన్ మొత్తం 19 టెస్టుల్లో 14.81 సగటుతో 400 పరుగులు చేశారు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 'దక్షిణ ఆస్ట్రేలియాలో అంతర్జాతీయంగా తెలిసిన పేర్లలో బారీ జార్మన్ ఒకరు. అతను గొప్ప పోటీదారుడు, జెంటిల్మన్. అతను ఆడిన విధానం అద్భుతం. జార్మన్ ఎప్పుడూ సరదాగా ఉండేవారు' అని దక్షిణ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆండ్రూ సింక్లైర్ ట్వీట్ చేశారు.
'బారీ జార్మన్ తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ జీవించారు. ఎదుటివారితో తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఎప్పుడూ భయపడలేదు. అతడిని కోల్పోవడం దురదృష్టకరం' అని ఆండ్రూ తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా జార్మన్ మృతిపై సంతాపం తెలిపింది. 191 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 129 స్టంపింగ్లు కలిపి మొత్తం 560 మందిని ఆయన పెవిలియన్ పంపారు. బారీ జార్మన్కు భార్య గేనోర్, నలుగురు పిల్లలు (క్రిస్టెన్, గావిన్, జాసన్, ఎరిన్) ఉన్నారు.