
సిడ్నీ: ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ల నిడివిని నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదనను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ కూడా వ్యతిరేకించాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ల నిర్వహణ పట్ల తాను ఆసక్తి చూపడం లేదన్నాడు. ఆదివారం క్రికెట్ ఆస్ట్రేలియాతో పాంటింగ్ మాట్లాడుతూ... 'నాలుగు రోజుల టెస్టులకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఈ ఆలోచన వెనుక కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నా' అని అన్నాడు.
'గత రెండు ఏళ్లలో చాలా టెస్టులు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ.. గత దశాబ్దంలో ఎక్కువ మ్యాచ్లు డ్రాలే అయ్యాయి. ఆ సమయాల్లో నాలుగు రోజుల టెస్టులే ఉండి ఉంటే.. దాదాపు అన్ని మ్యాచ్లు డ్రాలే అయ్యేవి. ఇక్కడ వాణిజ్యపరమైన కోణం ఉందని అర్థం చేసుకున్నా. డబ్బులు ఆదా చేయడం కోసం ఆదివారం మ్యాచ్ ముగియడానికి గురువారం ఎలా ప్రారంభిస్తారు' అని పాంటింగ్ ప్రశ్నించాడు.
ఐసీసీ ప్రతిపాదనపై భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కోహ్లీ విముఖత వ్యక్తం చేసారు. స్వచ్ఛమైన క్రికెట్కు టెస్ట్లు ప్రతీక అని సచిన్ అన్నాడు. 'పాతబడిన బంతితో ఐదో రోజు స్పిన్నర్లు తిప్పేయాలనుకుంటారు. ఒక రోజును తగ్గిస్తే.. పిచ్ నుంచి స్పిన్నర్లకు లభించే సానుకూలతను దూరం చేసినట్టే. టెస్ట్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి నిడివి తగ్గించడం పరిష్కారం కాదు. క్రికెట్లో వన్డేలు, టీ20లు, టీ10లు వచ్చాయి. సంప్రదాయ ఫార్మాట్ను కుదించకూడదు' అని సచిన్ సూచించాడు.
టెస్టు క్రికెట్ను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలనే ఆలోచన సరైంది కాదని కోహ్లీ అన్నాడు. 'డే/నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే/నైట్ టెస్టు విజయవంతం కావడంతో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
టెస్ట్ మ్యాచ్ల కుదింపు ప్రతిపాదనను టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, ఆసీస్ పేస్ దిగ్గజం మెక్గ్రాత్ కూడా వ్యతిరేకిస్తున్నారు. 2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఐసీసీ ప్రతిపాదనను మాజీలు అందరూ వ్యతిరేకిస్తుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ మద్దతు ఇచ్చాడు.