భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ఇష్టమైన సమయంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పే హక్కు ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. 37 ఏళ్ల రోహిత్ న్యూజిలాండ్తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్లో రోహిత్ పేలవమైన ఆట తీరును కనబర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా శర్మ తడబడుతున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ముగిశాయి. ఇందులో మూడు టెస్ట్ ల్లో రోహిత్ శర్మ ఆడాడు.
మూడు టెస్టుల్లో రోహిత్ 6.20 సగటుతో 31 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో అతని అత్యధిక స్కోర్ 10 గా ఉంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. దీనిపై క్లార్క్ మాట్లాడాడు. "అనేక మంది ఆటగాళ్లను చూస్తాం. కొందరికి కెప్టెన్సీ అచ్చి రాదు. రోహిత్ సిడ్నీలో ఆడతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అతనిని డ్రాప్ చేస్తారని నేను అనుకోను. కెప్టెన్గా ఉన్నప్పుడు మీకు ఇంకా కొంచెం వెసులుబాటు లభిస్తుంది" అని క్లార్క్ పేర్కొన్నాడు.

కానీ రోహిత తన ఇష్టప్రకారం వీడ్కోలు పలకడానికి అవకాశం ఉంది. సిడ్నీ అతని చివరి టెస్ట్ అవుతుందా అనే ఆలోచన లేదని క్లార్క్ చెప్పాడు. అతను ఏమి ఆలోచిస్తున్నాడో తనకు ఖచ్చితంగా తెలియదని" క్లార్క్ అన్నాడు. "రోహిత్కు కెప్టెన్సీ వైజ్గా ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు. అతనికి ఈ మధ్యే కొడుకు పుట్టాడు. అతను ఖచ్చితంగా సిడ్నీలో ఆడతాడని నేను ఊహించుకుంటాను" అని క్లార్క్ వివరించాడు.
రోహిత్ సారథ్యం వహించిన 24 టెస్టుల్లో భారత్ 12 గెలవగా.. తొమ్మిది టెస్ట్ ల్లో ఓడిపోయింది. మూడు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అతని కెప్టెన్సీలో ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో కూడా ఆడింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలని రోహిత్ భావిస్తున్నారు. అలాగే WTC ఫైనల్లో ఆడాలనే తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భారత్ చూస్తోంది.