విరాట్ కోహ్లీని 'అహంకారి' అని వ్యాఖ్యానించినందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కెర్రీ ఒకీఫ్ క్షమాపణలు చెప్పాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజున ఆస్ట్రేలియా తరఫున మొదటి మ్యాచ్ ఆడుతున్న సామ్ కాన్ స్టాస్ ను కోహ్లీ ఢీకొట్టడంపై అభ్యంతరం తెలిపిన ఒకీఫ్ అనుచితమైన పదాలను ఉపయోగించాడు. ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్, "కోహ్లీ తన కెరీర్ మొత్తాన్ని అహంకారంతో నిర్మించుకున్నాడు" అని విమర్శించాడు. 75 ఏళ్ల అతను తన తప్పును గ్రహించి టెస్ట్ మ్యాచ్ 2వ రోజు క్షమాపణలు చెప్పాడు.
"విరాట్ కోహ్లీ ప్రవర్తనను అహంకారం అని పిలిచినందుకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను అలా అనకూడదు. అతను తనలాగే మరొక ఆటగాడు అహంకారం చూపడం చూసినప్పుడు అతను ఒకింత చిరాకు పడ్డాడు" అని ఒకీఫ్ పేర్కొన్నాడు. ఒకీఫ్ 1971 నుంచి 1977 మధ్య ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. కాగా మెల్ బోర్న్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఆసీస్ ఆటగాడు సామ్ కాన్ స్టాస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు.

అతను ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. విరాట్ కోహ్లీ ప్రవర్తనపై ఆసీస్ మాజీ ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ వివాదం పై కాన్ స్టాస్ స్పందించాడు. తాము ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని చెప్పాడు. విరాట్ వస్తున్నట్లు తాను గమనించలేదని పేర్కొన్నాడు. గ్లవ్స్ను సరిచేసుకునే పనిలో ఉండగా ఇది జరిగిందని తెలిపాడు. కాగా మెల్ బోర్న్ టెస్ట్ లో ఇండియా పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేశాడు. అతను రన్ ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 36 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3 పరుగులే చేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో రిషబ్ పంత్, రవింద్ర జడేజా ఉన్నారు. భారత్ 310 పరుగుల వెనుకంజలో ఉంది.