
ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ ప్లేయర్ నాగరాజు బుడుమూరు చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. చాలా కంపెనీలను మోసం చేసిన అతను భారీగా డబ్బు కాజేసినట్లు సమాచారం. ఆంధ్ర తరఫున క్రికెట్ ఆడిన అతను సుమారు 60పైగా కంపెనీలను మోసం చేసి, మూడు కోట్ల రూపాయల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. 28 ఏళ్ల నాగరాజు రకరకాల కారణాలు చూపిస్తూ ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీని మోసం చేసిన అతను.. ఆ కంపెనీ నుంచి రూ.12 లక్షలు కాజేశాడు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చాలా దగ్గర మనిషిగా తనను తాను పరిచయం చేసుకున్న తర్వాతనే నాగరాజు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 2014 నుంచి 2016 వరకు నాగరాజు.. ఆంధ్ర ప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున కొంత కాలం ఆడాడు. కానీ ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. దీంతో అతని జీవిత విధానం మొత్తం మారిపోయింది. డబ్బులు రావడం కష్టమైంది. ఈ కారణంగా అతని లగ్జరీ లైఫ్ దెబ్బతిన్నది.

ఈ క్రమంలో తన లగ్జరీ లైఫ్ను కొనసాగించేందుకు మోసాలు ప్రారంభించిన నాగరాజు.. స్థానికంగా ఉన్న ఎలక్ట్రానిక్ షాపులో పని చేసే ఉద్యోగికి కాల్ చేశాడు. తను ఏపీ సీఎం జగన్కు చాలా దగ్గరి మనిషినని చెప్పుకున్న నాగరాజు.. దేశవాళీల్లో ఆడుతున్న రికీ భుయ్ అనే క్రికెటర్కు స్పాన్సర్షిప్ కావాలని సదరు ఎలక్ట్రానిక్ కంపెనీని అడిగాడు.
దీని కోసం తనకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)తో సంబంధాలు ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు కూడా తయారు చేశాడు. ఇలా తమ వద్ద నుంచి రూ.12 లక్షలు కాజేసినట్లు ఆ కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. నాగరాజు ఈ పద్ధతిలో సుమారు 60 కంపెనీలను మోసం చేసి, మూడ కోట్ల వరకు కాజేసినట్లు అధికారులు గుర్తు చేశారు.