ముంబై: మే 19న ముంబైలోని వాంఖడె స్డేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి మరచిపోలేని రోజుగా మిగిల్చింది. మొదటిది డకౌట్, రెండోది ధోని జట్టు ఓటమి. అంతే కాదు శ్రీలంకకు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే ధోనికి జరిమానా కూడా విధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సార్లు ఛాంపియన్గా అవతరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వాలిఫయిర్ 1లో భాగంగా ముంబైలోని వాంఖడె స్డేడియంలో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
తొలుత టాస్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 187 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లకే 162 పరుగులు చేసి ఆలౌటైంది. ఐపీఎల్ 8వ ఎడిషన్లో ఈ మ్యాచ్లోనే చెన్నై ఓపెనర్లు అత్యంత చెత్తగా ఆడారు.
చెన్నై ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (0), హస్సీ (16) పరుగులకే పెవిలియన్కు చేరుకున్నారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ డ్వేన్ స్మిత్ని ఎల్బీడబ్లుగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. అది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమేనన్నారు.
అంఫైర్ నిర్ణయాన్ని ధోని బహిరంగంగా తప్పుబట్టినందుకు గాను మ్యాచ్ రిఫరీ ధోనికి 10 శాతం జరిమానా విధించాడు. మంగళవారం ఐపీఎల్ క్వాలిఫయిర్ 1 మ్యాచ్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అంఫైర్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పు బట్టినందుకు గాను అతనికి 10 శాతం జరిమానాని మ్యాచ్ రిఫరీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని లెవెల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే క్వాలిఫయిర్ 1లో చెన్నై జట్టు ఓడినా ఫైనల్కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం (మే 20)న రాజస్ధాన్ రాయల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో ఎవరైతే విజయం సాధిస్తారో, ఆ జట్టుతో మే 22న రాంచీలో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
