సిమ్లా: ధర్మశాలలో భారత్, పాకిస్థాన్ల క్రికెట్ మ్యాచ్ జరగాలంటే, మౌలానా మసూద్ అజర్ తలను తీసుకురావాలని మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ మంత్రి మేజర్ విజయ్ సింగ్ మంకోతియా డిమాండ్ చేశారు. మసూద్ తలను తెస్తేనే మార్చి 19న భారత్-పాకిస్థాన్ ఆడనిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ మేరకు భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై మంకోతియా నేతృత్వంలో సమావేశమైన మాజీ సైనికులు బీసీసీఐని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఇరు జట్ల మధ్య మ్యాచ్ ను ధర్మశాలలో నిర్వహించాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజహర్ తలను అప్పగించాలి' అని అన్నారు.

'దాదాపు 7వేల మంది కాశ్మీర్ మీదుగ పాకిస్తాన్ నుంచి మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండా ధర్మశాల స్టేడియంలో ఎగురుతుంది. అప్పుడు పరిస్థితులు మరింత క్షీణిస్తాయి. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ను ఇక్కడ నిర్వహించడానికి మేము వ్యతిరేకం. ఇప్పటికే ఆపరేషన్ బలిదాన్(త్యాగం)ను చేపట్టడానికి సమాయత్తమయ్యాం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు వరల్డ్ టీ20లో భాగంగా ధర్మశాల వేదికగా 19న భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉండగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దీనిని నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పీసీబీ మరోసారి బెదిరింపులకు దిగింది.
వరల్డ్ టీ20లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్ ఆడుతుందని భారత ప్రభుత్వం ఓ బహిరంగంగా ప్రకటన చేయాలని కోరింది. ప్రకటన రాకపోతే చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడబోమని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు.