క్రికెట్ పండగకు వేళైంది. రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ 17వ సీజన్లో ప్రతిజట్టూ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. మన సన్రైజర్స్ హైదరాబాద్ సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది. కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్ల చేరికతో ఎస్ఆర్హెచ్ ఎంతో బలంగా ఉంది. అత్యుత్తమ నలుగురు విదేశీ ప్లేయర్లతో జట్టు కూర్పు సెట్ అయితే సన్రైజర్స్కు తిరుగుండదు.
లీగ్లో శనివారం ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలైన దూకుడుతో సీజన్ ప్రారంభిస్తామని, ఎస్ఆర్హెచ్ అభిమానులు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. వేలంలో కమిన్స్ కోసం సన్రైజర్స్ ఫ్రాంచైజీ రూ.20.50 కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.

బౌలింగ్, బ్యాటింగ్తో పాటు నాయకత్వ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలడని కమిన్స్ కోసం రూ.కోట్లు కుమ్మరించింది. గత సీజన్లో సన్రైజర్స్ను నడిపించిన మార్క్రమ్ను తప్పించి కమిన్స్ జట్టు పగ్గాలు అందించింది. ''ఈ సీజన్ను గొప్పగా ప్రారంభించాలని చిన్న ప్రణాళికతో ఉన్నాం. టీ20లు కష్టతరమైనవి. కోల్కతా బలమైన జట్టు. కానీ అసలైన దూకుడుతో ఈ సీజన్ ఆరంభించాలని చూస్తున్నా'' అని కమిన్స్ అన్నాడు.
''మా జట్టు కలయిక గొప్పగా ఉంది. భువనేశ్వర్ వంటి అనుభవజ్ఞులు మా జట్టులో ఉన్నారు. ఎయిడెన్ మార్క్రమ్ గత సీజన్లో జట్టును నడిపించాడు. అయితే మా టీమ్లో ఉత్తేజకరమైన యువ నైపుణ్యం ఉంది. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి టాలెంటెడ్ యువ ఆటగాళ్లను చూడటం ఎంతో బాగుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ సీజన్ను ఆస్వాదించడానికి ఎస్ఆర్హెచ్ అభిమానులు సిద్ధంగా ఉండండి'' అని కమిన్స్ పేర్కొన్నాడు. గత సీజన్లో హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. మరి, ఈ సీజన్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జేన్సన్, వాషింగ్టన్ సుందర్, సాన్విర్సింగ్ , భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, వానిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ మహరాజ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్.