IND A vs AUS A: కాన్పూర్లో ఇండియా-ఏతో జరగనున్న మూడో, నిర్ణయాత్మక అనధికారిక వన్డే మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ ఆటగాళ్లకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆదివారం కాన్పూర్లో జరగాల్సిన ఈ కీలక మ్యాచ్పై ఆటగాళ్ల అనారోగ్యం ప్రభావం చూపనుంది. ఆటగాళ్లకు అస్వస్థత కలిగిన సమాచారం తెలియగానే ఆహార విభాగం అప్రమత్తమైంది. ఆటగాళ్లు బస చేసిన హోటల్ నుంచి కందిపప్పు, మటర్ పనీర్, అన్నం, గ్రిల్డ్ చికెన్, ఇతర ఆహార నమూనాలు పరీక్షల నిమిత్తం సేకరించారు.
హోటల్ భోజనం వల్ల కాదు: రాజీవ్ శుక్లా
ఆస్ట్రేలియా-ఏ ఆటగాళ్ల అస్వస్థతపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఇది హోటల్ భోజనం వల్ల జరిగి ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా.. "భోజనంలో ఏదైనా లోపం ఉంచే అందరూ అనారోగ్యానికి గురయ్యేవారు. కానీ అలా జరగలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంచి హోటల్ భోజనం తీసుకుంటున్నారు. అందరూ అదే ఫుడ్ తింటున్నారు. బహుశా ఇద్దరు-నలుగురు ఆటగాళ్లకు వేరే చోట ఏదైనా ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చు." అని అన్నారు. అలాగే కాన్పూర్ నగరంలో మ్యాచ్ల నిర్వహణ గురించి ఆయన మాట్లాడుతూ.. నగరంలో మంచి హోటల్ గదుల కొరత ఉందని, అవసరమైనన్ని వసతులు లభించడం లేదని పేర్కొన్నారు.

సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్ నేడే..
ప్రస్తుతం మూడు మ్యాచ్ల అనధికారిక వన్డే సిరీస్లో ఇండియా 'ఏ'-ఆస్ట్రేలియా 'ఏ' జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇండియా 'ఏ' తొలి మ్యాచ్లో 171 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 'ఏ' రెండో మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మూడో మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. వన్డే సిరీస్కు ముందు జరిగిన టెస్టు సిరీస్ను కూడా ఇండియా 'ఏ' 1-0తో గెలుచుకుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు ఆటగాళ్లకు అస్వస్థత కలగడం ఆస్ట్రేలియా 'ఏ' జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే.