
హైదరాబాద్: దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మొహమ్మద్ సిరాజ్ ఓ హైదరాబాదీ. సన్ రైజర్స్ టీం తరపున ఆడేందుకు సిరాజ్ ఎంపికయ్యడు. 2017 అక్టోబరులో తన అసాధారణ ప్రతిభతో సిరాజ్ను ఇండియన్ క్రికెట్ టీం తన జట్టులోకి చేర్చుకుంది. 2017 ఐపీఎల్ సీజన్కు గాను సిరాజ్ను హైదరాబాద్ సన్రైజర్స్ టీం 2.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
దీంతో నవంబరులో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేశాడు ఈ హైదరాబాదీ. అతని తండ్రి ఆటో డ్రైవర్. తమ్ముడు ఐటీ ఉద్యోగి.
తన తండ్రి ఆటో నడిపితే గానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో కూడా సిరాజ్ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ను పక్కన పెట్టలేదు. ఆర్థిక పరిస్థితులతో సతమతమైనప్పటికీ తన ప్రాక్టీస్ను ఎప్పుడూ ఆపలేదు. అక్టోబరులో సన్ రైజర్స్ టీంకు ఆడేందుకు అతనికి వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని కొద్ది నెలల ముందే చెప్పాడు. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్కు ఎంపికైన సిరాజ్ ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన చివరి టీ20లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి సిరాజ్ తమ్ముడైన ఇస్మాయిల్ మరో ముగ్గురు సమీప బంధువులు కలిసి ముంబై వెళ్లారు. స్టేడియంలో ఒక వ్యక్తి ఇస్మాయిల్ని గుర్తు పట్టారు. 'ఇన్ని వేల మందిలో నన్ను సిరాజ్ తమ్ముడిగా గుర్తుపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. మా అన్న వల్ల మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మా అందరికీ ఇదో కొత్త అనుభవం. ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఇస్మాయిల్.
'సిరాజ్ను ప్రోత్సహించేందుకు మేమంతా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం. అతడు మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాం. టీమిండియాలో సిరాజ్ను చూడటంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. అతను విజయవంతం కావాలనే మేము ప్రార్థిస్తున్నాం' అని ఇస్మాయిల్ తెలిపాడు.
అన్న కోసం..
బెంగళూరులో ఓ ప్రముఖ ఐటీ సంస్థలో విధులు నిర్వహించే ఇస్మాయిల్ అన్న కోసం ఆ ఉద్యోగం వదులుకున్నాడు. ఎందుకంటే సిరాజ్ కాంట్రాక్టులు, అకౌంట్స్.. ఇలా అన్ని ఇస్మాయిలే ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నాడు. 'ఈ కొత్త బాధ్యతలు నిర్వహించడం ఎంతో సంతృప్తిగా ఉంది. మా కుటుంబం నుంచి ఒకడు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడంటే మాకు ఎంతో గర్వంగా ఉంది' అని ఇస్మాయిల్ నవ్వుతూ చెబుతున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.