
హైదరాబాద్: శనివారం మాల్దీవులు పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్కు క్రికెట్ బ్యాట్ను బహుమతిగా ఇచ్చారు. సాధారణంగా ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు ఎప్పుడు వెళ్లినా అపురూపమైన బహుమతులు తన వెంట తీసుకువెళ్లి అక్కడి ప్రముఖులకు అందజేస్తుంటారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రెండవసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మాల్దీవులకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్ని బహుకరించాడు.
సోలిహ్ క్రికెట్ వీరాభిమాని. ఆయనకు ఆ క్రీడపై ఉన్న మక్కువ గురించి బాగా తెలిసిన మోదీ ఓ క్రికెట్ బ్యాట్ను స్వయంగా ఆయనకు బహుకరించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోహిల్ క్రికెట్ అభిమాని కావడం మోడీ ఈ కానుకను ఆయనకు బహుకరించారు. ఈ విషయాన్ని మోడీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
"క్రికెట్తో అనుబంధం. నా స్నేహితుడు, అధ్యక్షుడు సోలిహ్ క్రికెట్ వీరాభిమాని. అందుకే ఆయనకు ప్రపంచ కప్ ఆడుతున్న భారత జట్టు సంతకాలు చేసిన క్రికెట్ బ్యాట్ను బహుకరించాను" అని మోడీ ట్వీట్ చేశారు. మాల్దీవులు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం "నిషాన్ ఇజ్జుద్దీన్" అందజేశారు.
తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వాణిజ్య, సివిల్ సర్వెట్ల శిక్షణ తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. రెండోసారి ప్రధాని పీఠం అధిష్టించిన తర్వాత మోడీ తన తొలి విదేశీ పర్యటనను పొరుగు దేశమైన మాల్దీవులతో ప్రారంభించారు.
ఇదిలా ఉంటే, మోడీ పర్యటనలో భాగంగా మాల్దీవులు యూత్, స్పోర్ట్స్ మినిస్టర్ అహ్మద్ మల్హాఫ్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుని బీసీసీఐ ఎలాగైతే దత్తత తీసుకుందో అదే విధంగా మాల్దీవుల్లో కూడా క్రికెట్ను విస్తరించేందుకు తగిన ప్లాన్తో బీసీసీఐని కలవనున్నట్లు తెలిపారు.