హైదరాబాద్: క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ తొలిసారి పైనల్కు చేరిన రైజింగ్ పూణె సూపర్ జెయింట్ మరికొన్ని గంటల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఇప్పటికే రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ తుది పోరుకు వేదిక కానుంది.
ఈ నేపథ్యంలో పుణె ప్రధాన కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ మీడియాతో మాట్లాడాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య సఖ్యత చాలా బాగుందని, అదే ఇప్పుడు జట్టును ఫైనల్కి చేర్చిందని ప్లెమింగ్ వివరించాడు.

'ధోనీ, స్మిత్ మంచి నాయకులమని ఇప్పటికే నిరూపించుకున్నారు. జట్టులో వారి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంది. యువ క్రికెటర్లు కూడా వీరి నుంచి ఎక్కువగా నేర్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సీనియర్ల జోడి అనుభవంతో కోచ్గా నా పని సులువైంది' అని అన్నాడు.
'స్టీవ్స్మిత్తో కలిసి పని చేయడం ఇదే తొలిసారి అయినప్పటికీ సౌకర్యవంతంగా ఉంది. లీడర్ షిప్ విషయానికి వస్తే ఓ ఛాలెంజ్ మా ముందుంది. ఈ టోర్నీలో మా ముందు ఉన్న అన్ని ఛాలెంజ్లను విజయవంతంగా పూర్తి చేశాం' అని పేర్కొన్నాడు.
కోచ్గా నా ముందున్న అతి పెద్ద సవాల్ పైనలే. టోర్నీ ప్రారంభానికి ముందే పూర్తిస్థాయిలో సన్నద్దమయ్యాం. గత దశాబ్దంలోనే ఎక్కువ విజయవంతమైన క్రికెటర్ ధోని. అతనికి ఐపీఎల్ ఫైనల్ రూపంలో మరో ఛాన్స్ ఎదురుచూస్తోంది' అని ప్లెమింగ్ అన్నాడు.
ఇప్పటికే చెన్నై సూపర్కింగ్స్ని రెండు సార్లు విజేతగా నిలిపిన ధోని.. ఈ మ్యాచ్లో తన ప్రదర్శనతో పూణెని గెలిపిస్తే అదో చరిత్ర అవుతుందని రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.