అంతర్జాతీయ క్రికెట్కు మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచి ఎవరికీ అంతనంత ఎత్తులో ఉన్న ఆసీస్ మహిళల టీం కెప్టెన్ మెగ్ లానింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు పదమూడేళ్ల పాటు ఆస్ట్రేలియా టీంకు సేవలు అందించిన ఆమె.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లు చేరుకుంది.
ఇప్పుడు సడెన్గా ఆమె ఈ నిర్ణయం ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకైపోయారు. ఆమె తన కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 241 మ్యాచులు ఆడి 8352 పరుగులు చేసింది. తన నిర్ణయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. ఇలా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం చాలా కఠినమైందని, కానీ ఇదే దానికి తగిన సమయం అని ఫీలవుతున్నానని ఆమె చెప్పింది.

'పదమూడేళ్ల అంతర్జాతీయ కెరీర్ గడిపినందుకు నిజంగా అదృష్టవంతురాలిగా భావిస్తున్నా. కానీ వేరే కొత్త జీవితంలోకి వెళ్లిపోవడానికి ఇదే సరైన సమయం అని నాకు తెలుసు. నాకు అండగా నిలిచిన కుటుంబం, టీంమేట్స్, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆసీస్ క్రికెటర్స్ అసోసియేషన్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని ఆమె పేర్కొంది.
'ఇంత మంది మద్దతు వల్లనే నాకు ఇష్టమైన ఆటను అంతర్జాతీయ స్థాయిలో ఆడగలిగా. ఈ కెరీర్ ఆసాంతం అండగా నిలిచిన ఫ్యాన్స్ అందరికీ కూడా హృదయ పూర్వక ధన్యవాదాలు' అని వెల్లడించింది. 2010లో కివీస్తో జరిగిన టీ20 మ్యాచులో లానింగ్ అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత 2014లో 21 ఏళ్ల వయసులో టీం కెప్టెన్గా బాధ్యతలు అందుకుంది. కెప్టెన్సీలో 80 శాతంపైగా విజయాలు సాధించిన ఆమె.. 2014, 2018, 2020, 2023 టీ20 వరల్డ్ కప్స్, 2022 వన్డే వరల్డ్ కప్ కూడా నెగ్గింది. ఇలా ఐదు ఐసీసీ వరర్డ్ కప్స్ గెలిచిన ఆమె ఇలా అర్ధంతరంగా ఆటకు వీడ్కోలు పలకడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని జోస్యం చెప్తున్నారు.