Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ జట్టు నుంచి కనీసం ఐదుగురు స్టార్ ఆటగాళ్లను పాక్ క్రికెట్ బోర్డు తొలగించే అవకాశం ఉంది. ఇందులో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 29 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నమెంట్ ను నిర్వహించే అవకాశం పాకిస్థాన్ కు లభించింది. కానీ ఈ కీలక టోర్నమెంట్ లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టే మొదటగా నిష్క్రమించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్, భారత్ జట్ల చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టులోని కొంత మంది ఆటగాళ్లపై ప్రమాద కత్తి వేలాడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఐదుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది.
ముందుగా రిజ్వాన్ కార్డు కట్..
పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు కెప్టెన్ మహ్మద రిజ్వాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శనను పక్కన పెట్టినప్పటికీ.. ఈ ఆటగాడు తన కెప్టెన్సీలో పాక్ క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించాడు. ఏ మైదానంలో ఎలాంటి ప్లేయింగ్ 11ను వాడుకోవడంలో కెప్టెన్ గా రిజ్వాన్ విఫలమయ్యాడు. రిజ్వాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే.. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 3 పరుగులకు, భారత్ పై 46 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ జట్టుపై రిజ్వాన్ స్ట్రైక్ రేట్ 22 కాగా.. భారత్ పై 59గా ఉంది. ఈ క్రమంలో రిజ్వాన్ కెప్టెన్సీతో పాటు స్థానం ప్రమాదంలో ఉన్నాయి.

బాబర్ ఆజం మెడపై వేలాడుతున్న కత్తి
ఇటీవల కాలంలో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణం బాబర్ ఆజం. ఫార్మాట్ ఏదైనా బాబర్ యాజమాన్యం నమ్మకాన్ని బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడితే.. భారత్ పై బాబర్ ఆజం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడడంతో పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. బాబర్ జట్టు కోసం కంటే తన కోసమే ఎక్కువగా ఆడతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇబ్బందుల్లో నసీమ్ షా
పాకిస్థాన్ జట్టులో ఇప్పుడిప్పుడే చోటు సంపాదించుకుంటున్న మరో ఆటగాడు నసీమ్ షా. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో నసీమ్ షా ఒక వికెట్ పడగొట్టాడు. అయితే భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. నసీమ్ బంతులు ఇప్పుడు స్వింగ్ అవ్వడం లేదు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టే వేగం కూడా అతని దగ్గర లేదు. అందువల్ల నసీమ్ షా స్థానం కూడా ప్రమాదంలో ఉంది.
తాహిర్ కచ్చితంగా ఔట్
తయ్యబ్ తాహిర్ కు పాకిస్థాన్ జట్టులో హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ గా స్థానం లభించిందియ. కానీ తాహిర్ ను ఔట్ చేయడం ఏ జట్టుకైనా సులభమైన పని. తయ్యబ్ తాహిర్ న్యూజిలాండ్ పై కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. భారత్ పై కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 8 వన్డేలు ఆడిన తర్వాత తాహిర్ 150 పరుగులు కూడా చేయలేకపోయాడు. అందుకే అతడిపై కచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది.