రంజీ ట్రోఫీలో బరోడా-ముంబై మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో అరుదైన రికార్డు నమోదైంది. ముంబై జట్టులో 10, 11వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. తనుష్ కొటియన్(120*, 129 బంతుల్లో), తుషార్ దేశ్పాండే (123; 129 బంతుల్లో) ఈ ఘనత సాధించారు. చివరి రెండు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ఇద్దరూ ఒకే ఇన్నింగ్స్లో సెంచరీ సాధించడం ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో సారి మాత్రమే.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1946లో తొలిసారిగా 10, 11వ స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. ఓవల్ వేదికగా సర్రే వర్సెస్ ఇండియన్స్ మ్యాచ్లో ఈ ఘనత నమోదైంది . చందు సర్వతే, షూటే బెనర్జీ చివరి స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి శతక్కొట్టారు. 78 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో మరో రికార్డు నమోదైంది.

తనుష్-తుషార్ జోడీ మరో ఘనత సాధించారు. చివరి వికెట్కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మూడో భారత జోడీగా రికార్డులకెక్కారు.ఈ జాబితాలో చందు-బెనర్జీ (249 పరుగులు), అజయ్ శర్మ-మణిందర్ సింగ్ (233 పరుగులు) టాప్-2లో ఉన్నారు. తనుష్-తుషార్ 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
తుషార్ దేశపాండే మరో రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన భారత ఆటగాళ్లలో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు బెనర్జీ (121) పేరిట ఉంది. అలాగే ఆఖరి స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మూడంకెల స్కోరును అందుకున్న భారత మూడో బ్యాటర్ తుషార్.
కాగా, బీకేసీ గ్రౌండ్లో క్వార్టర్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో ముంబై 384 పరుగులు, బరోడా 348 పరుగులు చేసింది. 36 పరుగులు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 569 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ముంబై జట్టు 337 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన తుషార్ దేశ్పాండేతో కలిసి తనుష్ చివరి వికెట్కు 232 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వీరిద్దరికి ఇవే తొలి సెంచరీలు కావడం విశేషం. తనుష్ 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదగా, తుషార్ 10 బౌండరీలతో పాటు ఎనిమిది సిక్సర్లు బాదాడు. స్పెషలిస్ట్ బ్యాటర్లు తరహాలో వీరిద్దరు బౌండరీలతో హోరెత్తించారు.