సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు వరుస ఓటముల తర్వాత... ఐదో వన్డేలో భారత్ గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. అంతేకాదు.. ట్వంటీ 20 పైన ఆశలు కల్పించింది. ఐదో వన్డేలో బ్యాటింగులో మనీష్ పాండే, బౌలింగులో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన బూమ్రా అధరగొట్టారు.
వారి ముఖ్య పాత్ర వల్లే భారత్ అయిదో వన్డేలో గెలిచింది. అయితే, మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర కూడా ఇందులో కొట్టిపారేయలేనిది. చివరి ఓవర్లో.. అంటే 6 బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో... ధోనీ 50వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి అవుటయ్యాడు.
అయితే సిక్స్ కొట్టి.. తర్వాతి బ్యాట్సుమెన్ పైన ఒత్తిడి తగ్గించాడు. మిచెల్ మార్ష్ 50వ ఓవర్ వేశాడు. అప్పుడు భారత్ గెలుపుకు 13 పరుగులు కావాలి. మొదటి బంతి వైడ్ పోయింది. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతికి ధోనీ అవుటయ్యాడు.

ధోనీ సిక్స్ కారణంగా... చివరలో భారత్ గెలుపుకు 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసే పరిస్థితి కల్పించాడు. ధోనీ 42 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో మనీష్ పాండే భారత్ను విజయతీరాలకు చేర్చాడు. అంతేకాదు, ధోనీ ఆ సిక్స్తో తనను తాను కూడా కాపాడుకున్నాడని చెప్పవచ్చు. ఇటీవల అతని పైన విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే.
మనీష్ పాండే అద్భుతంగా ఆడాడు. అతను 81 బంతుల్లో 104 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా సెంచరీకి ఒక పరుగు దూరంలో.. 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. ధావన్ 78 పరుగులు చేశాడు. రోహిత్, ధావన్ కూడా తమ వంతు పాత్ర పోషించారు.
కాగా, చివరి వన్డేలో కీలక పాత్ర పోషించిన బూమ్రా ఈ మ్యాచ్ ఆడటమే విచిత్రం. ముందు ఆస్ట్రేలియా పర్యటనకు ప్రకటించిన రెండు జట్లలో అతడికి చోటే అయితే ఐతే గాయపడిన మహ్మద్ షమి స్థానంలో బూమ్రాను టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. అతను శుక్రవారమే ఆస్ట్రేలియాకు వచ్చాడు.
బూమ్రా తొలి టీ20కే ఆతిథ్యమిచ్చే అడిలైడ్కు వెళ్లాల్సి ఉన్నా జట్టు సిడ్నీలో ఉండటంతో అక్కడికే వచ్చాడు. అదే సమయంలో భువవనేశ్వర్ గాయపడిన నేపథ్యంలో బూమ్రాను వన్డే జట్టులోకి తీసుకుని ఐదో వన్డేలో ఆడించారు. మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భువనేశ్వర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలెక్టర్లు రిషి ధావన్ను ఎంపిక చేశారు. చేతి గాయం నుంచి రహానె పూర్తిగా కోలుకోని నేపథ్యంలో అతడికి రక్షణగా గుర్కీరత్ సింగ్ను జట్టుతో పాటే కొనసాగించాలని నిర్ణయించారు.